Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్తాన్‌ నుంచి వేరుపడిన బలూచిస్తాన్..! ఆగస్ట్ 11న ఇండిపెండెన్స్ డే.. ప్రపంచ దేశాలకు కీలక విజ్ఞప్తి

పాకిస్తాన్‌ నుంచి వేరుపడిన బలూచిస్తాన్..! ఆగస్ట్ 11న ఇండిపెండెన్స్ డే.. ప్రపంచ దేశాలకు కీలక విజ్ఞప్తి

Telugu Samayam 5 days ago

పాకిస్థాన్ నుంచి విడిపోయామని తనకు తాను ప్రకటించుకున్న బలూచిస్తాన్ మరో కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 11వ తేదీని బలూచిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవంగా అధికారికంగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది.

ఇక నుంచి తమది స్వతంత్ర దేశమని.. దాని పేరు 'రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్' అని పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న బలూచ్ ప్రజలు ఆగస్ట్ 11వ తేదీని ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చింది. అలాగే అంతర్జాతీయ సమాజం తమను స్వతంత్ర, సార్వభౌమ దేశంగా గుర్తించాలని కోరింది.

ఈ క్రమంలోనే సోమవారం విడుదల చేసిన ఈ ప్రకటనలో బలూచ్ విముక్తి ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి బలూచ్ కుటుంబం తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల్లో స్వతంత్ర బలూచిస్తాన్ జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. ఈ చారిత్రక దినం ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.

ఆగస్టు 11కే ఎందుకు ప్రాధాన్యం?

రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ప్రకారం.. 1947 ఆగస్ట్ 11వ తేదీన బ్రిటిష్ పాలన ముగిసే సమయంలో బలూచిస్తాన్ స్వాతంత్య్రాన్ని ప్రకటించిందని పేర్కొంది. ఆ ప్రకటనను అప్పటి అంతర్జాతీయ మీడియా, ఆల్ ఇండియా రేడియో కూడా ప్రచురించాయని తమ వాదనలో తెలిపింది. అందుకే ప్రతీ ఏడాది ఆగస్ట్ 11వ తేదీనే తమ స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. 1948లో బలూచిస్థాన్‌ను పాకిస్థాన్‌ బలవంతంగా విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

పాకిస్థాన్‌పై తీవ్ర ఆరోపణలు

ఈ ప్రకటనలో పాకిస్థాన్ విధానాలపై మీర్ యార్ బలూచ్ తీవ్ర విమర్శలు చేశారు. కాశ్మీర్ సమస్య, 1948లో బలూచిస్తాన్‌పై సైనిక చర్య, 1971లో తూర్పు పాకిస్థాన్ విభజన, సోవియట్-అఫ్గాన్ యుద్ధం, చగాయ్ అణు పరీక్షలు, సెప్టెంబర్ 11వ తేదీ తర్వాతి పరిణామాలు వంటి అనేక సంఘటనలకు పాకిస్థాన్ విధానాలే కారణమని ఆరోపించారు. ఈ పరిణామాలు దక్షిణాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అస్థిరతకు దారితీశాయని పేర్కొన్నారు.

ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి

పాకిస్థాన్ ప్రస్తుతం ఉన్నట్లు కొనసాగినంత కాలం దక్షిణాసియాలో శాశ్వత శాంతి, అభివృద్ధి సాధ్యం కాదని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పేర్కొంది. అందువల్ల తమ స్వాతంత్య్రాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించి మద్దతు ఇవ్వాలని కోరింది. తమతో 6 కోట్ల మంది బలూచ్ ప్రజలు ఉన్నారని.. తాము స్వతంత్ర దేశమని బలూచ్ జాతీయ వాద గ్రూపులు ప్రకటించాయి. అయితే ఈ ప్రకటనను ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. అలాగే ఐక్యరాజ్యసమితి, ప్రపంచంలోని ఏ దేశమూ బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించలేదు. ప్రస్తుతం బలూచిస్తాన్ అంతర్జాతీయంగా పాకిస్థాన్‌లోని ఒక ప్రావిన్స్‌గా గుర్తింపు పొందింది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam