Dailyhunt
"పాపం.. వాళ్లు కష్టాల్లో ఉన్నట్టున్నారు": అప్పు తీర్చమన్నందుకు యూఏఈపై పాకిస్థాన్ సెనేటర్ వెటకారం

"పాపం.. వాళ్లు కష్టాల్లో ఉన్నట్టున్నారు": అప్పు తీర్చమన్నందుకు యూఏఈపై పాకిస్థాన్ సెనేటర్ వెటకారం

Telugu Samayam 1 week ago

Pakistan Senator Mocks UAE Debt: పాకిస్థాన్ రాజకీయ నాయకుల నోటి దురుసే వారి దేశ దౌత్య సంబంధాలను నాశనం చేస్తున్నాయనే నిజానికి నిదర్శనంగా ఓ ఘటన చోటు చేసుకుంది.

ముఖ్యంగా గత ఏడేళ్లుగా పాకిస్థాన్‌ను ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై పాక్ సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు రావాల్సిన 3 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 27 వేల కోట్లు) అప్పును తిరిగి చెల్లించాలని యూఏఈ కోరడంపై ఆయన అత్యంత వ్యంగ్యంగా స్పందించారు. పాపం.. వాళ్లే అప్పుల్లో ఉన్నారనంటూనే విమర్శలు చేశారు. ఆపూర్తి వివరాలు మీకోసం.

"బేచారా.. మజ్బూర్" అంటూ యూఏఈపై ఎద్దేవా

ఒక వార్తా ఛానెల్‌తో మాట్లాడిన ముషాహిద్ హుస్సేన్.. యూఏఈని ఉద్దేశించి "బేచారా" (పాపం), "మజ్బూర్" (నిస్సహాయులు) అని సంబోధించారు. పాకిస్థాన్ యూఏఈ వద్ద చేసిన అప్పులను తిరిగి చెల్లిస్తుండటం తనకు సంతోషంగా ఉందని చెబుతూనే.. "పాపం యూఏఈకి డబ్బు అవసరముంది. వారు ట్రంప్‌కు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోవాలి. ఒకవేళ వారు ఇబ్బందుల్లో ఉంటే.. పెద్దన్నగా పాకిస్థాన్ వారికి సహాయం చేస్తుంది" అని విడ్డూరంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా యూఏఈకి పాక్ ఎల్లప్పుడూ సాయం చేస్తూ వచ్చిందని.. ఆదేశ నిర్మాణంలోనే పాకిస్థాన్ హస్తం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం.

భారత్‌తో స్నేహంపై హెచ్చరిక

యూఏఈ, భారత్ మధ్య పెరుగుతున్న సంబంధాలపై కూడా సెనేటర్ మండిపడ్డారు. యూఏఈలో ఉన్న 10 మిలియన్ల జనాభాలో దాదాపు 4.3 మిలియన్ల మంది భారతీయులే ఉన్నారని గుర్తు చేస్తూ.. "మీరు జాగ్రత్తగా ఉండాలి. భారత్‌తో మీ స్నేహం మిమ్మల్ని 'అఖండ భారత్'లో భాగం చేయకుండా చూసుకోండి" అంటూ వివాదాస్పద హెచ్చరికలు జారీ చేశారు.

పాక్ సెనేటర్ ఇలా మాట్లుడుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆదేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గత ఏడేళ్లుగా యూఏఈ తన అప్పును వాయిదా వేస్తూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం అప్పు తీర్చాల్సిందే అని యూఏఈ ఖరాకండిగా చెప్పడంతో పాకిస్థాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. చెల్లించాల్సిన 3 బిలియన్ డాలర్లు పాకిస్థాన్ వద్ద ఉన్న మొత్తం విదేశీ మారక నిల్వలలో (16.4 బిలియన్ డాలర్లు) దాదాపు 18 శాతం కావడం గమనార్హం. పెరుగుతున్న చమురు ధరల వల్ల పాక్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైంది. ఇప్పుడు యూఏఈకి అప్పు కట్టాల్సి రావడం మరింత కష్టంగా మారినప్పటికీ.. పాక్ మాత్రం ఈరకమైన వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam