ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్'. డార్లింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ..
వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రతీ అప్డేట్ ఎగ్జైట్మెంట్ రెట్టింపు చేస్తూ వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని డిస్కషన్స్ జరుగుతున్న తరుణంలో, నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన విషయాలను పంచుకున్నారు.
భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఇప్పటికే 'స్పిరిట్' సినిమాలో కొన్ని సన్నివేశాలను చూశానని, అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని సినిమా అని, బలమైన భావోద్వేగాలతో కూడిన పోలీస్ స్టోరీ అని వెల్లడించారు. సందీప్ రెడ్డి తరహాలో పూర్తిగా కొత్త తరహాలో చాలా ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. సందీప్ రెడ్డి వంగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డిలను భూషణ్ కొనియాడారు. ఇద్దరికీ అసలు ఈగోనే లేదని, అంకితభావంతో వర్క్ చేస్తారని ప్రశంసించారు.
''సందీప్, ఆయన బ్రదర్ ఇద్దరూ వర్క్ గురించి తప్ప దేని గురించీ ఆలోచించరు. వాళ్లకి అసలు ఈగో ప్రాబ్లమ్ లేదు. సందీప్ 'స్పిరిట్' లాంటి అద్భుతమైన సినిమా తెరకెక్కిస్తున్నారు. నేను షూటింగ్ కి సంబంధించిన కొన్ని సీన్స్ చూశాను. అద్భుతంగా ఉన్నాయి. సందీప్ మరోసారి ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని ఒక సినిమాతో రాబోతున్నారు. ఇది సేమ్ ఒక పోలీసాఫీసర్ స్టోరీ. ఇందులో అతనికి భార్య ఉంటుంది. ఎమోషన్స్ తో పాటు అన్నీ ఉంటాయి. కానీ వాటి ప్రజెంటేషన్ చాలా కొత్తగా ఉంటుంది. సందీప్ వంగా 'యానిమల్', 'కబీర్ సింగ్', 'అర్జున్ రెడ్డి' మాదిరిగానే సేమ్ మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు. గ్రేట్ మ్యూజిక్, గ్రేట్ మ్యాజికల్ స్కోర్ తో ఒక మ్యాజికల్ మూవీ రూపొందిస్తున్నారు'' అని భూషణ్ కుమార్ చెప్పారు.
'స్పిరిట్' నిర్మాత చెప్పిందాన్ని బట్టి, ఇది బలమైన భావోద్వేగాలతో కూడిన ఒక కాప్ డ్రామా అని అర్థమవుతోంది. సాధారణ స్టోరీ అయినప్పటికీ, సందీప్ రెడ్డి వంగా మార్క్ ట్రీట్మెంట్ తో సరికొత్తగా ప్రజెంట్ చేయబడుతోందని తెలుస్తోంది. ప్రభాస్ తన కెరీర్ లో తొలిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఇప్పటివరకూ చూడని సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, నటి కాంచన ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
టి - సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై భూషణ్కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. 2027 మార్చి 5న తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో 'స్పిరిట్' సినిమాని విడుదల చేయనున్నారు.

