Supreme Court Judgement on TET: దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల అర్హతలపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చింది.
విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులంతా నిర్దేశిత సమయంలోగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసి ఖచ్చితంగా అర్హత సాధించాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. గతంలో తాము ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సవాలు చేస్తూ వివిధ ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను న్యాయస్థానం పూర్తిగా కొట్టేసింది. అయితే ఉపాధ్యాయుల భవిష్యత్తును, విద్యార్థుల విద్యావ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని.. టెట్ పాస్ కావడానికి ఇది వరకు ఇచ్చిన రెండేళ్ల గడువును మాత్రం మూడేళ్లకు పెంచుతూ కొంత ఉపశమనం కల్పించింది.
జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది. ఈ తాజా సవరణ ప్రకారం.. ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించడానికి ఇదివరకు ఉన్న 2027 ఆగస్టు 31 డెడ్లైన్.. ఇప్పుడు 2028 ఆగస్టు 31 వరకు పొడిగించబడింది. ఈ ఒక్క మార్పు మినహా గతంలో ఇచ్చిన తీర్పులోని మిగతా అన్ని అంశాలు యథావిధిగా అమలులో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
69 ఉపాధ్యాయ సంఘాల పిటిషన్లు తిరస్కరణ..
రాష్ట్రాలకు కీలక ఆదేశాలు..!
గతంలో విధించిన కఠిన నిబంధనల వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు ఒకేసారి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని.. తద్వారా పాఠశాలల్లో ప్రాథమిక విద్య నిరాటంకంగా సాగడానికి ఆటంకం ఏర్పడి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఉపాధ్యాయ సంఘాలు కోర్టు దృష్టికి తెచ్చాయి. ఈ మానవీయ కోణాన్ని పరిశీలించిన ధర్మాసనం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకు ఉన్న అసాధారణ అధికారాలను ఉపయోగించి గడువును మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రాథమిక విద్యకు ఎలాంటి అడ్డంకులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ తుది అవకాశం ఇస్తున్నట్లు న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

