ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి ప్రేమికులకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు. ముఖ్యంగా యోగా సాధన చేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థను ఏర్పాటు చేయనుంది.
వంద పడకల యోగా - ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఈ పరిశోధన సంస్థ ఏర్పాటయితే యోగా రంగంలో రాష్ట్రం కీలక కేంద్రంగా మారుతుందని చెప్పొచ్చు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 15.03 ఎకరాల్లో రూ. 100 కోట్లతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఆయుష్ మంత్రిత్వ శాఖ బృందం ఈ స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన స్థలాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక బృందం పరిశీలించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే వంద పడకల ఆధునిక ఆస్పత్రితో పాటు యోగా, ప్రకృతి వైద్యానికి సంబంధించిన పరిశోధన, శిక్షణ, వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉండనున్నాయి. ప్రజలకు సేవలు అందించడంతో పాటు పరిశోధనలకు కూడా ఇది కేంద్రంగా మారనుంది.
మూడు నెలల్లో స్థల అభివృద్ధి, రహదారి, కాలువలు తదితర మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేస్తే మిగతాది కేంద్రం ఆధ్వర్యంలో పనులు వేగంగా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రూ. 100 కోట్ల అంచనా వ్యవయంతో నిర్మించనున్న ఈ కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ కార్యకలాపాలు 2028 నాటికి ప్రారంభం కానున్నాయని మంత్రి తెలిపారు.
"మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి ఈ స్థలం అప్పగిస్తాం. సంస్థ కార్యకలాపాలు 2028లో ప్రారంభించాలి అనేది లక్ష్యం. ఈ ప్రాంగణంలోనే వంద పడకల యోగా ప్రకృతి వైద్యశాల కూడా ఏర్పాటవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు యోగా, ప్రకృతి వైద్యంతో సమగ్ర చికిత్స అందించడంతో పాటు పరిశోధ, చికిత్స, శిక్షణ సేవలు అన్ని ఒకేచోట అందుబాటులో ఉంటాయి" అని మంత్రి సత్యకుమార్ తెలిపారు.

