పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ది రాజాసాబ్'. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మొహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రిలీజ్ అయింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. ప్రభాస్ స్టార్ డమ్ కారణంగా భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, నెగెటివ్ టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్ తర్వాత నిలబడలేకపోయింది. తాజాగా ఈ మూవీపై నిర్మాత SKN ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'టాక్సీవాలా', 'బేబి' వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న నిర్మాత ఎస్కేఎన్.. ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాని విడుదలకు సిద్ధం చేశారు. జులై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా SKN విలేకరుల సమావేశం నిర్వహించారు. సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ 'ది రాజాసాబ్' మూవీ గురించి ప్రస్తావించగా.. ఆ సినిమా ఫలితంతో తనకేం సంబంధం లేదన్నట్టుగా ఎస్కేఎన్ సమాధానమిచ్చారు.
* కోలీవుడ్లోకి శివాజీ ఎంట్రీ.. 'డ్రాగన్+డ్యూడ్' కాంబోలో ప్రదీప్ రంగనాథన్ క్రేజీ ప్రాజెక్ట్!
''రాజాసాబ్' సినిమా గురించి హీరో, డైరెక్టర్ లేదా నిర్మాత మాట్లాడాలి. సినిమాలో చిన్న భాగమైన నేను మాట్లాడటం సరికాదు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో ఏమైనా మాట్లాడొచ్చు కానీ.. ఇప్పుడు నేను మాట్లాడకూడదు'' అని SKN అన్నారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ నెట్టింట వైరల్ అయింది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఆ వీడియో డిలీట్ చేయబడింది. అయితే అప్పటికే ఈ ఆడియో విన్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఎస్కేఎన్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. సినిమా రిలీజుకు ముందు అన్ని మాటలు చెప్పి, ఇప్పుడు తనకేం సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
* 'ఆడపిల్ల శాడిజాన్ని ఎంజాయ్ చేయడానికే థియేటర్లకి వెళ్లారు'.. బ్లాక్ బస్టర్ మూవీపై నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందిన 'రాజాసాబ్' సినిమాకి SKN ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఎక్కడికి వెళ్లినా ఈ సినిమా గురించి గొప్పగానే మాట్లాడారు. మామూలుగా పందేలు కోళ్లపై వేస్తే, ఈసారి డైనోసార్ మీద వేస్తున్నామంటూ హైప్ ఎక్కించారు. 'పండగ పండగ రెబల్ పండగ.. పండగ పండగ రాజాసాబ్ పండగ' అంటూ స్టేజ్ మీద ఆయన మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మారుతీ ఎమోషనల్ అయితే, ఆయన వెనుక నిల్చొని SKN కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమాతో అంత ఎమోషనల్ బాండింగ్ పెట్టుకొని, ఇప్పుడు రిజల్ట్ గురించే అడిగితే డైరెక్టర్, హీరో, నిర్మాతని అడగాలని ఎస్కేఎన్ అనడం ఏంటని ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఇక 'చెన్నై లవ్ స్టోరీ' విషయానికొస్తే.. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ ఈ చిత్రానికి కథ అందించగా.. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. 'బేబి' వంటి కల్ట్ మూవీ తర్వాత SKN, సాయి రాజేష్ నుంచి రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.
* 'చెన్నై లవ్ స్టోరీ' ఈవెంట్లో నిర్మాత SKNకు ఊహించని షాక్.. 'జై ఎన్టీఆర్' అంటూ నినాదాలు!

