తెలంగాణలో సామాజిక, విద్యరంగంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభ్యుదయ భారత్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సూదిని పద్మారెడ్డి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థ యునైటెడ్ అమెరికన్ వర్సటీ ఆయనకు ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. దేశవ్యాప్తంగా మానవీయ, సామాజిక, విద్యా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖులను గుర్తించి ఈ యూనివర్సిటీ ఏటా డాక్టరేట్లు అందిస్తుంది. ఇందులో భాగంగా పుదుచ్చేరిలోని కలైరంగమ్ ఆడిటోరియంలో సోమవారం జరిగిన కన్వకేషన్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున సూదిని పద్మారెడ్డి ఈ గౌరవ డాక్టరేట్ను స్వీకరించారు.
డాక్టరేట్ తీసుకున్న అనంతరం పద్మారెడ్డి మాట్లాడుతూ.. తమ ట్రస్ట్ ద్వారా చేస్తున్న చిన్న సేవలను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినందుకు యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందని.. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని ప్రకటించారు.
కాగా, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి సూదిని పద్మారెడ్డి స్వయాన మామ. మాజీ కేంద్ర మంత్రి, దివంగత సూదిని జైపాల్ రెడ్డికి సొంత తమ్ముడు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా (ప్రస్తుత రంగారెడ్డి జిల్లా) పరిధిలోని మాడ్గుల గ్రామం వీరి స్వగ్రామం. ఉన్నత రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ పద్మారెడ్డి తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారు. తాను స్థాపించిన అభ్యుదయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 25 సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ముఖ్యంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల మౌలిక వసతుల అభివృద్ధికి ఆయన పెద్దఎత్తున నిధులు సమకూరుస్తున్నారు. పేద విద్యార్థులు చదువు మధ్యలో ఆపేయకుండా ఉండేందుకు ప్రతీ ఏటా స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా.. పేద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంచడానికి వారిని ఉచితంగా విమానాల్లో తీసుకెళ్లడం, తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలు కల్పించడం వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పద్మారెడ్డికి తెలంగాణ ఉద్యమంతోనూ అనుబంధం ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలనే బలమైన ఆకాంక్షతో 2001లోనే కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతాల పట్ల, ఆలోచనల పట్ల స్ఫూర్తి పొంది ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2008 తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

