దశాబ్దాలుగా, ఆధునిక వైద్యంలో సిజేరియన్ సెక్షన్లు (సి-సెక్షన్లు) ప్రాణాలను రక్షించే అత్యంత ముఖ్యమైన శస్త్రచికిత్సలుగా ఉన్నాయి. ప్రసవ సమయంలో తల్లులు లేదా శిశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే సంక్లిష్ట పరిస్థితుల్లో, ప్రసవాన్ని సురక్షితం చేయడం ద్వారా ఇవి మరణాల రేటును తగ్గించడంలో సాయపడ్డాయి.
అయితే, ఒక వైద్య విధానం రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నప్పుడు, దానికి గల కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) ఈ అంశంపై మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది. భారతదేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 62.2% ప్రసవాలు సిజేరియన్ల ద్వారా జరుగుతున్నాయి. ఇది జాతీయ సగటు (27.2%) కంటే రెండింతలు ఎక్కువ. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సంఖ్య ఏకంగా 83.9% కి చేరుకుంది. అంటే ప్రతి 10 కాన్పులలో 8 కంటే ఎక్కువ శస్త్రచికిత్స ద్వారానే జరుగుతున్నాయి.
ఈ గణాంకాలను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ చర్చను "నార్మల్ డెలివరీ వర్సెస్ సి-సెక్షన్" అనే కోణంలో చూడకూడదు. సిజేరియన్లు ప్రతిరోజూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నాయి. తల్లి, బిడ్డ ఇద్దరికీ తరచుగా సురక్షితమైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే.. శస్త్రచికిత్స అవసరమయ్యేలా గర్భధారణలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? ఈ విషయంపై డాక్టర్ వై. దివిష రెడ్డి (కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్, గ్లెనెగల్స్ హాస్పిటల్, లక్డీకాపూల్, హైదరాబాద్) పూర్తి సమాచారం అందించారు.
మారుతున్న మహిళల ఆరోగ్య పరిస్థితి
గర్భం దాల్చే సమయానికి మహిళల్లో ఉంటున్న ఆరోగ్య సమస్యలు సి-సెక్షన్లు పెరగడానికి ఒక ముఖ్య కారణం. తెలంగాణ NFHS-6 డేటా ప్రకారం, 36% కంటే ఎక్కువ మంది మహిళలు అధిక బరువు (స్థూలకాయం) తో బాధపడుతున్నారు. అలాగే ఐదుగురిలో ఒకరికి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం లేదా మధుమేహం (డయాబెటిస్) ఉన్నట్లు తేలింది. గర్భం దాల్చే వయస్సు గల మహిళల్లో రక్తపోటు (బీపీ) కూడా సర్వసాధారణంగా మారుతోంది.ఈ ఆరోగ్య పరిస్థితులు గర్భధారణ సమయంలో ప్రమాదాల్ని పెంచుతాయి. అధిక బరువు వల్ల ప్రసవ వేదన ఎక్కువ సమయం ఉండటం, కడుపులోని బిడ్డకు ఇబ్బంది కలగడం, గర్భధారణ మధుమేహం, బీపీ వంటి సమస్యలు వస్తాయి. మధుమేహం వల్ల పుట్టే బిడ్డ బరువు ఎక్కువగా ఉండటం వలన సాధారణ ప్రసవం కష్టతరమవుతుంది. అదేవిధంగా, అధిక రక్తపోటు ఉన్నప్పుడు తల్లి, బిడ్డలను రక్షించడానికి వైద్యులు ముందే శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యల వల్ల ఎక్కువ మంది గర్భిణీలు 'హై-రిస్క్' (ఎక్కువ ప్రమాదం ఉన్న) కేటగిరీలోకి వస్తున్నారు.
వయసు, ఆధునిక జీవనశైలి
మరొక ముఖ్యమైన అంశం మహిళల వయసు. నేడు చాలా మంది మహిళలు విద్య, ఉద్యోగం, వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఆలస్యంగా పిల్లలను కనడం చూస్తున్నాం. ఇది సామాజికంగా మంచి పరిణామమే అయినప్పటికీ, వయస్సు పెరిగే కొద్దీ గర్భధారణలో సంక్లిష్టతలు కూడా పెరుగుతాయి, ఇవి సి-సెక్షన్కు దారితీస్తాయి.మరోవైపు, ఆధునిక గర్భధారణ విధానాలు కూడా మారాయి. ఫెర్టిలిటీ (సంతానోత్పత్తి) చికిత్సలు, కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలగడం, గతంలో సిజేరియన్ జరిగి ఉండటం, అత్యాధునిక స్కానింగ్ ల ద్వారా బిడ్డ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం వంటి కారణాల వల్ల కూడా వైద్యులు జాగ్రత్త కొద్దీ సి-సెక్షన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
దీంతో పాటు ప్రసవ వేదన (నొప్పులు) భరించలేమనే భయం, డెలివరీ సురక్షితంగా జరగాలనే ఆందోళన, అనుకూలమైన ముహూర్తాల ప్రకారం ప్రసవాలు కోరుకోవడం, చట్టపరమైన సమస్యలు రాకూడదని వైద్యులు తీసుకునే నిర్ణయాలు కూడా దీనిపై ప్రభావం చూపుతున్నాయి.
ఆశాజనకమైన విషయాలు
తెలంగాణ మాతా శిశు సంరక్షణ సూచీలలో అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. దాదాపు 99% ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. కాన్పుకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Antenatal Care) మెరుగ్గా ఉన్నాయి. ఈ విజయాల వల్ల తల్లులు, శిశువుల మరణాల రేటు గణనీయంగా తగ్గింది.చివరగా, సి-సెక్షన్ రేట్లను కేవలం గణాంకాల కోసమే తగ్గించడం మన లక్ష్యం కాకూడదు. ప్రతి ప్రసవ నిర్ణయం పూర్తిగా వైద్య అవసరాలు, శాస్త్రీయ ఆధారాలు, తల్లి-బిడ్డల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే జరగాలి. ప్రసవం అనేది రాత్రికి రాత్రే ప్రమాదకరంగా మారలేదు. కానీ మహిళలు గర్భధారణ సమయానికి ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లు మారుతున్నాయి. వీటిని అర్థం చేసుకుని, ముందే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే భవిష్యత్తు తరాలకు సురక్షితమైన ప్రసవాలను అందించగలం.
సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులు
డాక్టర్ వై. దివిష రెడ్డి,
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్,
(గ్లెనెగల్స్ హాస్పిటల్, లక్డీకాపూల్, హైదరాబాద్)

