ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన కారుమూరి దుర్గారెడ్డి హత్య కలకలం రేపింది. దుర్గారెడ్డికి రక్షణ కల్పించాలని తన కార్యాలయం నుంచి ఫోన్ చేసి చెప్పినా ఎస్సై పట్టించుకోలేదని టీడీపీ ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్ వ్యాఖ్యలు చేయడం హాట్టాపిక్ అయ్యింది.
దుర్గారెడ్డి హత్య గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే రోషన్ ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. దుర్గా రెడ్డి హత్యకు లా అండ్ ఆర్డర్ వైఫల్యమే కారణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం ఎస్సైకు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి తన పీఏ ఫోన్ చేశారని.. దుర్గా రెడ్డి సమస్య గురించి చెప్పామని.. ఈలోపే హత్య జరగడం దారుణమన్నారు. దుర్గారెడ్డిని హత్య చేసిన నిందితుల్ని 24 గంటల్లో పట్టుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే దుర్గారెడ్డి హత్య కేసులో పోలీసులు వైఫల్యం లేదని ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్ తెలిపారు. దుర్గారెడ్డికి తన సోదరుడు వెంకటరెడ్డితో ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దుర్గారెడ్డి, వెంకటరెడ్డి కుటుంబాలకు చెందిన నలుగుర్ని బైండోవర్ కేసులు నమోదు చేయడానికి జంగారెడ్డిగూడెం పోలీసులు సమాచారం ఇచ్చారన్నారు. ఈ నలుగురిలో ముగ్గురు పోలీస్ స్టేషన్కు వస్తే తహసీల్దార్ దగ్గర బైండోవర్ చేయించామన్నారు. దుర్గారెడ్డి బైండోవర్కు రాలేదని.. పోలీసులు పొగాకు రైతుల ధర్నా కార్యక్రమం దగ్గర బందోబస్తులో ఉన్నట్లు తెలిపారు. దుర్గారెడ్డి వివాదాస్పద భూమి దగ్గరకు వెళ్లగా జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య జరిగిందన్నారు. దుర్గారెడ్డి హత్యకేసులో నిందితుల్ని అరెస్ట్ చేశామని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు.
దుర్గారెడ్డికి ఆస్తి తగాదాలు
జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన కారుమూరి దుర్గారెడ్డి, వెంకటరెడ్డి అన్నదమ్ములు. కొంతకాలంగా రెండు కుటుంబాలకు ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. వారం క్రితం వెంకటరెడ్డి కుమారుడు కారుమూరి శ్రీనివాసరెడ్డి మరికొందరు కలిసి దౌర్జన్యం చేశారని.. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని దుర్గారెడ్డి, అతడి కుమారుడు నాగార్జునరెడ్డి ఇటీవల కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 5న దుర్గారెడ్డి వివాదంలో ఉన్న పొలం దగ్గర పనులు చేస్తుండగా వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి మరికొందర్ని వెంటబెట్టుకుని మరోసారి తమపై దౌర్జన్యం చేశారని దుర్గారెడ్డి, నాగార్జున రెడ్డి 112కు ఫిర్యాదు చేశారు.ఈ గొడవ తర్వాత జంగారెడ్డిగూడెం పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి బైండోవర్ చేశారు. మంగళవారం రోజు దుర్గారెడ్డిని రైతు సేవా కేంద్రం సమీపంలో కారుమూరి శ్రీనివాసరెడ్డి కత్తితో దారుణంగా నరికి చంపి పారిపోయాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుర్గారెడ్డికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు, టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి నిందితుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుర్గారెడ్డి హత్య కేసు, టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు జంగారెడ్డిగూడెంలో హాట్టాపిక్ అయ్యాయి.

