తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. కొండపై భక్తులు వసతి గదులు తీసుకుంటారు.. దర్శనం తర్వాత గదుల్ని ఖాళీ చేస్తారు.
కొంతమంది భక్తులు హడావిడిగా వెళుతుంటారు. కొందరు భక్తులు పొరపాటున ఈ హడావిడిలో వారి బంగారం, వెండితో పాటుగా విలువైన వస్తువుల్ని మర్చిపోయి వెళుతుంటారు. ఇలా తిరుమలలోని గదుల్లో వస్తువులు మర్చిపోయిన భక్తులకు టీటీడీ అధికారులు, సిబ్బంది తిరిగి జాగ్రత్తగా వారికి అప్పగిస్తున్నారు. తాజాగా భక్తులు గదిలో మర్చిపోయిన వెళ్లిన బంగారాన్ని టీటీడీ ఉద్యోగులు గుర్తించి తిరిగి అప్పగించారు.
హైదరాబాద్కు చెందిన భక్తులు శనివారం రోజు తిరుమల శ్రీవారి దర్శనం పూర్తిచేసుకుని అన్నమయ్య భవనంలో గదిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. భక్తులు ఖాళీ చేసిన తర్వాత గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన పారిశుద్ధ్య సిబ్బంది వెళ్లారు.. అయితే ఆ గదిలో బంగారు ఆభరణాలను గుర్తించారు. వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు ఆ భక్తులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన ఆ కుటుంబంలో ఒకరిని పిలిపించి గదిలో మర్చిపోయి వెళ్లిన బంగారు ఆభరణాలను తిరిగి అందజేశారు. తమ బంగారాన్ని జాగ్రత్తగా తిరిగి అప్పగించినందుకు టీటీడీ ఉద్యోగులకు భక్తుల కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.. కేవలం గంటల వ్యవధిలోనే తమ బంగారాన్ని తిరిగి అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. గదిలో మర్చిపోయిన బంగారం విలువ రూ. 4 లక్షల ఉందని చెబుతున్నారు.
తిరుచానూరులో అవతార మహోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడగా, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనం తదితర పవిత్ర ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా మహాభిషేకం నిర్వహించారు. వేదమంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ అభిషేక సేవ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో దివ్య మంగళ విహారం చేసి భక్తులకు అభయప్రదమైన దర్శనమిచ్చి అనుగ్రహించారు. మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీ సుందరరాజస్వామివారు హనుమంత వాహనాన్ని అధిరోహించి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
పురాణ, చారిత్రక ఆధారాల ప్రకారం మధురైలోని అళగిరి పెరుమాళ్ ఆలయంపై ముష్కరుల దాడుల సమయంలో అక్కడి అర్చకులు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చినట్లు ప్రచారంలో ఉంది. అనంతరం మహంతుల కాలంలో మూలమూర్తులను ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. జ్యేష్ఠమాసంలో శతభిష నక్షత్రం రోజున తిరుచానూరుకు విచ్చేసిన సందర్భంగా ప్రారంభమై ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు కొనసాగే ఈ అవతార మహోత్సవాలను టీటీడీ ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.

