Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తొలి పెళ్లి దాచి ఓనర్‌ను పెళ్లాడింది.. మరొకరి ప్రేమలో పడి రెండో భర్తను చంపింది.. కానీ చివరకు?

తొలి పెళ్లి దాచి ఓనర్‌ను పెళ్లాడింది.. మరొకరి ప్రేమలో పడి రెండో భర్తను చంపింది.. కానీ చివరకు?

Telugu Samayam 1 week ago

Miyapur Landlord Pentesh Murder: హైదరాబాద్‌ మియాపూర్‌లో కట్టుకున్న భార్యే.. ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన కేసు గురించి మనందరికీ తెలిసిందే.

అయితే ఈ విషయం మంగళవారం రోజే వెలుగులోకి వచ్చినప్పటికీ.. భార్య, ప్రియుడు కలిసి భర్తను ఎలా చంపారు, మహారాష్ట్ర బోర్డర్‌కు తీసుకెళ్లి ఏం చేశారు, ఆపై ఎలా డ్రామాను నడిపించారనే దానిపై పోలీసులు పూర్తి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా మృతుడితో పాటు అతడి భార్య, ఆమె ప్రియుడు వివరాలను కూడా వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి ఓ అపార్ట్‌మెంట్ యజమాని అయిన 52 ఏళ్ల మల్లాని పెంటేష్ అని గుర్తించారు. అతడి భార్య సత్యవతిని అని, ఆమె ప్రియుడు మధుసూదన్ రెడ్డి అని తేల్చారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

మొదటి పెళ్లి దాచి ఓనర్‌ను పెళ్లాడి..!

52 ఏళ్ల వయసు కల్గిన మల్లాని పెంటేష్‌కు పదేళ్ల క్రితమే మొదటి భార్యతో విభేదాలు వచ్చాయి. దీంతో పిల్లలను ఆమె వద్దే వదిలేసి.. అంబేద్కర్ నగర్‌లోని తన సొంత అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 40 ఏళ్ల సత్యవతి అనే మహిళ.. సదరు అపార్ట్‌మెంట్‌లో పని మనిషిగా చేరింది. పెంటేష్ ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని ఆమె అతడికి బాగా దగ్గరైంది. తనకు ఇదివరకే పెళ్లయిన విషయాన్ని పూర్తిగా దాచి పెట్టి.. పెంటేష్‌ను రెండో పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు భర్తతో కలిసి సంతోషంగానే గడిపింది.

అపార్ట్‌మెంట్‌లోనే మరో వ్యక్తితో అక్రమ సంబంధం..!

కానీ పెంటేష్‌ను పెళ్లాడిన కొద్దిరోజులకే సత్యవతి బుద్ధి మార్చుకుంది. అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరి వ్యవహారం కాస్తా పెంటేష్‌కు తెలియడంతో అతడు తీవ్రంగా మందలించి, మధుసూదన్ రెడ్డిని అపార్ట్‌మెంట్ నుంచి ఖాళీ చేయించి బయటకు పంపించేశాడు. తమ బంధానికి అడ్డంగా ఉన్నాడనే కోపంతో.. ఎలాగైనా పెంటేష్‌ను వదిలించుకోవాలని సత్యవతి, ఆమె ప్రియుడు మధుసూదన్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారు. గతేడాది నవంబర్ 19వ తేదీ రాత్రి సత్యవతి ప్లాన్ ప్రకారం భర్త పెంటేష్ తినే భోజనంలో భారీగా నిద్ర మాత్రలు కలిపింది. అది తిన్న పెంతేష్ కొద్ది సేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ వెంటనే సత్యవతి తన ప్రియుడు మధుసూదన్ రెడ్డిని లోపలికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి నిద్రిస్తున్న పెంతేష్ ముఖంపై దిండును గట్టిగా నొక్కి పెట్టి.. ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు.

శవాన్ని మహారాష్ట్రకు తరలించి దహనం..

హత్య అనంతరం నిందితులిద్దరూ పెంటేష్ శవాన్ని రాత్రికి రాత్రే ఒక కారులో పెట్టి.. వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని తుల్జాపూర్ పరిసర ప్రాంతాలకు తరలించారు. అక్కడ ఒక నిర్మానుష్య ప్రాంతంలో శవాన్ని పడేసి.. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి దహనం చేశారు. శవం సగం కాలిన స్థితిలో ఉండటాన్ని గమనించిన మహారాష్ట్ర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మరోవైపు హైదరాబాద్ తిరిగొచ్చిన సత్యవతి.. తన భర్త కనిపించడం లేదంటూ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలు పరిశీలించగా.. పెంటేష్ చివరిసారిగా బేగంపేట్ పరిసరాల్లో ఫోన్ మాట్లాడినట్లు తేలింది.

ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. అయితే సత్యవతి ప్రవర్తనపై పెంటేష్ బంధువులకు గట్టి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈక్రమంలోనే పోలీసులు సత్యవతి కాల్ రికార్డింగులను పరిశీలించగా.. మధుసూదన్ రెడ్డితో ఎక్కువగా మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఇలా అతడిని అదుపులోకీ తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా.. తామే ఈ హత్య చేసినట్లు తెలిపారు. మఉఖ్యంగా తామే పెంటేష్‌కు నిద్ర మాత్రలు ఇచ్చి.. పడుకున్న తర్వాత దిండుతో నొక్కి చంపేసినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam