రాజస్థాన్ రాయల్స్ ఆడిన తీరుని తలుచుకుంటేనే భయమేస్తోంది. ఇద్దరు కుర్రోళ్లు, అందులో ఒకడు 15 ఏళ్లు.. ఇటు వైపు వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లు, బంతిని కొడితే బౌండరీ తప్ప మరేం లేదు.
గువాహటి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిసిందా అన్నట్టు ఆడారు. వరల్డ్ నెంబర్ వన్ పేస్ బౌలర్ బుమ్రా బౌలింగ్లో బాల్ టచ్ చేయాలంటేనే హడల్.. అలాంటిది మూడు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి అందర్నీ స్టన్నయ్యేలా చేశాడు వైభవ్ సూర్యవంశీ.
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ - ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఫ్యాన్స్కి ఫుల్ ఐ ఫీస్ట్ని అందించింది. వర్షం కారణంగా రాత్రి 10:10 గంటలకు ప్రారంభమైన మ్యాచ్లో టాస్ 9:55 గంటలకు పడింది. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ తొలి బంతి నుంచే రాజస్థాన్ దూకుడు చూసి ముంబై పని అయిపోయిందని అర్థమయింది.
దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్తో యశస్వి జైస్వాల్ ఏకంగా 22 పరుగులు బాదాడు. నిలకడగా ఆడే జైస్వాలే విధ్వంసం సృష్టించడంతో వైభవ్ సూర్యవంశీ మెరుపు షాట్లతో విరుచుకుపడ్డాడు. అవతల బౌలర్ ఎవరు అనేది పక్కన బెట్టి బంతి కొడితే బౌండరీ బయట పడాలి అన్నట్టు ఆడాడు. బుమ్రా, బౌల్ట్ను చితక్కొట్టాడు.
రెండో ఓవర్లో బుమ్రా బౌలింగ్కి రాగా స్ట్రయికింగ్లో వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. తొలి బంతినే సిక్సర్ బాది అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. బుమ్రా కూడా ఒక్కసారిగా షాక్లోకి వెళ్లాడు. రెండో బంతి డాట్ కాగా మూడో బంతిని ఫైన్ లెగ్ మీదగా భారీ షాట్ కొడితే అది స్టాండ్స్లో పడింది. బుమ్రాతో పాటు మిగతా పది మంది ముంబై ప్లేయర్లు చూడటం తప్పించి, చేసేదేం లేక చేతులెత్తేశారు.
వైభవ్ సూర్యవంశీ 14 బంతులు ఆడి ఒక ఫోర్, ఐదు సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుటయ్యాడు. బుమ్రా, బౌల్ట్, శార్దూల్ ఠాకూర్ ఇలా అందరి బౌలింగ్లో సిక్సర్లు బాదాడు. జైస్వాల్ 77 పరుగులు బాదడంతో 11 ఓవర్లలో రాజస్థాన్ 150/3 చేసింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 123 పరుగులే చేసి ఓటమిపాలయింది.

