కోలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ వరకు తన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు హీరో ధనుష్. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తూ, కోలీవుడ్లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు.
విలక్షణ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న ఈ స్టార్ హీరో భవిష్యత్తులో రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశం ఉందంటూ తాజాగా వినిపిస్తున్న వార్తలు ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ధనుష్ తండ్రి, సీనియర్ దర్శకుడు కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి.
* 'పెద్ది' ప్రీరిలీజ్ ఈవెంట్.. తెలుగు స్పీచ్తో అదరగొట్టిన జాన్వీ.. 'మానవా మానవా' అంటూ నవ్వులు..!
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి రాజాకు, ధనుష్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఎంతో ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. 'చెన్నైలో పవర్ఫుల్ ప్రాంతం గోపాలపురమే. ఒకప్పుడు కలైంజ్ఞర్ కరుణానిధి జీవించిన ప్రాంతం అది. వెలుగు పుట్టిన స్థలం. ఇప్పుడు ముఖ్యమంత్రి పోయస్ గార్డెన్కు వస్తున్నట్లు చెబుతున్నారు. వస్తే రానివ్వండి. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, అది వారి వ్యక్తిగత ఇష్టం. భవిష్యత్తులో ధనుష్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టవచ్చు. మాకు రాజకీయాలు వద్దు అని చెప్పడానికి మనమెవరం? నేనైతే రాను, ఎందుకంటే నాకు వయసు అయిపోయింది. కానీ నా కొడుకులు (ధనుష్, సెల్వరాఘవన్) రావచ్చు, నా మనవళ్లు కూడా రావచ్చు' అని స్పష్టం చేశారు.
* నైజాం టు ఓవర్సీస్.. 'పెద్ది' టోటల్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ఈ సందర్భంగా కస్తూరి రాజా తన పాత రోజులను, కుటుంబ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఒకప్పుడు తేని నుంచి చెన్నై రావడానికి చేతిలో రూ. 50 కూడా లేక ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పారు. 19 ఏళ్ల వయసులోనే వివాహం జరిగిందని, భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఆదరణ, ప్రోత్సాహంతోనే చెన్నైలో కష్టపడి దర్శకుడిగా నిలదొక్కుకున్నానని వివరించారు. తమ కుటుంబ పరిస్థితిని మార్చిన చిత్రం 'తుళ్లువదో ఇళమై' అని ఆయన పేర్కొన్నారు. కెమికల్ ఇంజినీరింగ్ చదివిన తన పెద్ద కొడుకు సెల్వరాఘవన్ సినిమాల్లోకి వస్తానంటే.. ముందు చదువు పూర్తి చేయాలని చెప్పానని, ఆ తర్వాత గోల్డ్ మెడల్ సాధించిన సెల్వరాఘవన్ 'కాదల్ కొండేన్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమై తమ కుటుంబ భవిష్యత్తును మార్చేశాడని గర్వంగా చెప్పారు. అలాగే తన ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం చెన్నైలో ప్రముఖ డాక్టర్లుగా రాణిస్తున్నారని ఆయన వెల్లడించారు.
కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లిన తరహాలోనే, ధనుష్ సైతం చాలా కాలంగా తన అభిమాన సంఘాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తన పుట్టినరోజు సందర్భాల్లో పేదలకు పలు రకాల సహాయాలు అందిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ వర్గాల్లో అమిత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ప్రస్తుతం ధనుష్ కోలీవుడ్లో మోస్ట్ డిమాండ్ ఉన్న టాప్ స్టార్స్లో ఒకరిగా కొనసాగుతున్నారు. సార్, రాయన్, కుబేర, ఇడ్లీ కడై, కర వంటి చిత్రాలతో ఇటీవల కాలంలో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన తన ఇమేజ్ని మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం 'డి55' (D55) తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్న ధనుష్, భవిష్యత్తులో నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి!

