విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేవారికి కీలకమైన ఆనందపురం జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సమస్యలు వెంటాడుతున్నాయి.ఈ క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని గ్రహించి ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా ఆలోచన చేశారు.
ఆనందపురం జంక్షన్ మీదుగా.. విశాఖపట్నం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు.. అటు భోగాపురం ఎయిర్పోర్ట్కు వెళ్లే వాహనాలు సాఫీగా వెళ్లేలా కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఆనందపురం జంక్షన్ దగ్గర భోగాపురం వైపు వెళ్లేలా కొత్తగా ఓ ఫ్లైఓవర్ను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం వచ్చిన సమయంలో కొత్త ఫ్లై ఓవర్ గురించి ప్రస్తావించారు. ఈ ప్రతిపాదనలకు సీఎం ఓకే చెప్పడంతో అధికారులు ఈ ఫ్లై ఓవర్కు సంబంధించి అలైన్మెంట్ ఖరారు చేశారు. 45 రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేసి.. ఆమోదం రాగానే పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు.
ఇటీవల ఆనందపురం జంక్షన్, కూరగాయల మార్కెట్, పూల మార్కెట్లను ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ పరిశీలించారు. అక్కడ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు.. ప్రస్తుతం ఆనందపురం జంక్షన్ దగ్గర ఉన్న మార్కెట్ను మరోచోటికి తరలించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ మార్కెట్ను తరలిస్తే.. రాబోయే రోజుల్లో ఆనందపురం జంక్షన్ దగ్గర భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఈ అంశంపై కూడా ఫోకస్ పెట్టిన అధికారులు.. శాశ్వత పరిష్కారానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇటు అనకాపల్లి వెళ్లే వాహనాలు, అటు భోగాపురం వైపు వెళ్లే వాహనాలకు ఆనందపురం జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఫ్రీ జర్నీ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు అనుసంధానంగా నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, ఆర్ & బీ శాఖలు ఈ రోడ్ల పనులు జరుగుతున్నాయి. విశాఖపట్నం ఎంపీ భరత్, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్లు ఈ ప్రాజెక్టులపై సమీక్ష చేశారు. తిమ్మాపురం నుంచి మారికవలస రోడ్డు రహదారి పనులు ముగింపు దశకు వచ్చాయని ఎంపీ భరత్ తెలిపారు. అడవివరం నుంచి శొంఠ్యాం ఆరు లేన్ల రోడ్డుకు అనుమతులు వచ్చాయని.. ఆ పనులు ఊపందుకున్నాయన్నారు. నేరళవలస-కొత్తవలస, బోయపాలెం-కాపులుప్పాడ రహదారులు ఏప్రిల్ చివరినాటికి పూర్తవుతాయన్నారు.
పెందుర్తి ప్రాంతంలోని రోడ్డు పనులు మే-జూన్ నాటికి పూర్తి చేసే అవకాశం ఉందని భరత్ తెలిపారు. భీమిలి టు దొరతోట రోడ్డును 100 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ రోడ్లను నేషనల్ హైవేలతో అనుసంధానానికి ఇప్పటికే అనుమతులు లభించాయన్నారు. జూన్ నాటికి విమానాశ్రయానికి అనుసంధానంగా ఉన్న ఏడు కీలకమైన రోడ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, పనులను వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

