AP Weather Rain Alert : ఏపీలో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 46°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా, గూడూరులో గరిష్టంగా 46.2°C ఉష్ణోగ్రత నమోదవ్వగా.., ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1°C నమోదయ్యింది.
ఏపీ వ్యాప్తంగా మొత్తం 16 జిల్లాల్లోని 286 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల ప్రాంతం నుంచే ఎండ మంట మొదలవుతుంది. ఇక మధ్యాహ్న సమయంలో కాలు బయటపెట్టాలంటే.. మండే నిప్పుల కొలిమిలోకి అడుగు వేసినట్లుగా ఉంది. సాయంత్రం ఆరు గంటలు దాటినా ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు.
వడగాలుల హెచ్చరిక
రాష్ట్రంలోని 27 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరీ ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉందని తెలిపింది.
పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు
ఏపీలోని పలు ప్రాంతాల్లో మాడు పగిలే ఎండతో జనాలు అల్లాడుతుంటే.. మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం పిడుగులతో కూడిన వర్షం కురుస్తుంది. ద్రోణి ప్రభావంతో.. ఏపీలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అనకాపల్లి, కాకినాడ, కోనసీమ - తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, చిత్తూరు, తిరుపతి - తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు.
జాగ్రత్తలు:
ఎండ సమయంలో బయటకు వెళ్లకూడదు.
తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదు.
పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.
- వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

