Bandi Bhagirath : బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయ వాదుల సమక్షంలో అతడిని కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పగించారు. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్పై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఆ మరుసటిరోజు నుంచే భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడు. దీంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
నేడు పేట్ బషిరాబాద్ పోలీసుల ఎదుట అడ్వకేట్స్ సమక్షంలో బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. భగీరథ్ లొంగిపోయిన అనంతరం బండి సంజయ్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
బండి సంజయ్ తన పోస్ట్ లో.. మా అబ్బాయి బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపైనున్న గౌరవంతో ఈరోజు అడ్వోకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను. నేను ఇంతకు ముందే చెప్పిన. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే తనని స్టేషన్ లో అప్పగిద్దామనుకున్నా. లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఈరోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు చెబుతున్నారు. అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకముంది. సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావొద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించాను అని తెలిపారు.

