- పవన్ కళ్యాణ్ను కలిసిన బండ్ల గణేష్.
- మెగా ఈవెంట్లో క్రేజీ కలయిక.
- సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్.
Bandla Ganesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానులే కాదు..
సెలబ్రిటీలలోనూ వీరాభిమానులు ఉంటారు. వారిలో టాప్ లిస్ట్లో ఉండే పేరు నిర్మాత బండ్ల గణేష్. పవన్ను తన దేవుడిగా కొలిచే బండ్లన్న, గత కొన్ని కారణాల వల్ల కొంతకాలంగా ఆయనకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి. అయితే, వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ గురువారం ఈ ఇద్దరు కలిసి కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'మెగా 158' పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే ఈవెంట్కు విచ్చేసిన బండ్ల గణేష్(Bandla Ganesh), చాలా కాలం తర్వాత తన బాస్ను కలిసి కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
పవన్తో దిగిన పిక్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బండ్లన్న తన మార్క్ డైలాగ్తో ఎమోషనల్ అయ్యారు. "నేను సామాన్యంగా ఎవరినీ ప్రేమించను.. ఒక్కసారి ఒక మనిషిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే, సచ్చేదాకా వదిలిపెట్టను.. నువ్వంటే నాకిష్టం బాస్" అంటూ లవ్ ఎమోజీలను జోడించారు. 'గబ్బర్ సింగ్' లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ క్రేజీ కాంబో మళ్లీ ఇలా కలవడంతో, త్వరలోనే వీరి కాంబినేషన్లో మరో మాస్ బొమ్మ పడాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి నిజంగా ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తారా అనేది చూడాలి.

