- మందు బాబులపై యుద్ధం ఎఫెక్ట్
- సహజ వాయువు కొరతతో
- పెరగనున్న బీర్ ధరలు
Beer Prices Rise : పశ్చిమాసియాలోని యుద్ధం కారణంగా మన దేశంలో ఇప్పటికే గ్యాస్ సరఫరాకు తీవ్ర కొరత ఏర్పడింది.
ఇప్పుడీ ప్రభావం మందుబాబులను కూడా తాకనుంది. యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాలు.. మన దేశంలోని మద్యం బాటిళ్ల ధరలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. త్వరలోనే మన దేశంలో మద్యం బాటిళ్ల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ ప్రభావం.. మద్యం ధరల పెంపుకు దారితీస్తుంది అంటున్నారు.
మద్యం తయారు చేసే కంపెనీలకు ఇప్పుడు ముడి సరుకు కన్నా.. ప్యాకేజింగ్ ఖర్చే ఎక్కువైంది. కారణమేంటంటే.. సహజ వాయువు. మద్యం కంపెనీలకు దీనితో ఏం పని అంటే.. మద్యం బాటిళ్లను తయారు చేసే గాజు ఫర్నేస్లు అంటే కొలిమిలను నిత్యం మండించాలంటే.. గ్యాస్ కావాల్సిందే. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు దిగుమతిదారు. సహజ వాయువు కోసం ఇండియా ఖతార్ మీదనే ఆధారపడుతోంది. ఇక్కడి నుంచి 40 శాతం వరకు దిగుమతి చేసుకుంటున్నాం. అయితే పశ్చిమాసియా యుద్ధం వల్ల.. గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడితే అది నేరుగా గాజు బాటిళ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.
సాధారణంగా మద్యం తయారీ ఖర్చులో 40 శాతం వాటా ప్యాకేజింగ్కే అవుతుంది. విస్కీ, బ్రాండీలకు అయితే ఇది 20 శాతం వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాలకు ఆటంకం ఏర్పడితే.. మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. కేవలం గ్యాస్ ధరల వల్లే గాజు బాటిళ్ల ధర 15-20 శాతం పెరిగింది. దీనికి అదనంగా షిప్పింగ్ ఛార్జీలు తోడవ్వడంతో కంపెనీలు బ్రాండ్ల వారీగా 10-15 శాతం ధరలను పెంచేందుకు అనుమతి కోరుతున్నాయి. అయితే ప్రీమియం సెగ్మెంట్లలో ఈ పెంపు ప్రభావం వెంటనే కనిపించనుంది. మిగతా వాటి ధరలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్లలో ఈ ప్రభావం తక్షణమే కనిపించనుంది.

