Hyderabad Rich Kids Trap : జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులైన అన్నదమ్ములు అర్జున్, రాజీవ్ మరియు వారి మద్దతుదారులు ఇప్పటి వరకు సుమారు 25 మంది ధనవంతులైన మైనర్ బాలికలను ట్రాప్ చేసినట్లు వెల్లడైంది.
నిందితుడు అర్జున్ పోలీసులకు దొరకకుండా చాలా పగడ్బందీగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హనీట్రాప్లో భాగంగా అర్జున్ తన స్నేహితులు హర్ష, జతిన్, శ్రీజిత్ ల మొబైల్ ఫోన్ల ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు.
పోలీసులకు దొరికినా నేరం తన మీదకు రాకుండా ఉండేందుకు స్నేహితుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను వాడుకునేవాడు. తనను తాను బాగా డబ్బున్న వ్యక్తిగా చూపించుకోవడం కోసం ఖరీదైన బట్టలు ధరించి, లగ్జరీ కార్లలో తిరుగుతూ రీల్స్ పోస్ట్ చేసేవాడు. వీటిని లైక్ చేసే మైనర్ బాలికల వివరాలు సేకరించి వారిని ట్రాప్ చేసేవాడు. బాలికల తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి వెళ్లి, వారితో లైంగికంగా గడిపేవాడు. ఆ సమయంలో బాలికలకు తెలియకుండా వీడియోలు, ఫోటోలు తీసి, ఆ తర్వాత వాటితో వారిని బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేసేవాడు.
అర్జున్, రాజీవ్ ఇప్పటి వరకు సుమారు 25 మంది మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి, మొత్తం 40 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో, విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో నిందితులను మరో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

