Hyderabad : సినిమా అనే రంగుల ప్రపంచంలో వెలిగిపోవాలని.. తెర మీద తనను తాను చూసుకోవాలని కోటి ఆశలతో హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆ వ్యక్తి.. ఆ కలను సాకారం చేసుకోకుండానే కన్నుమూశాడు.
ఆడిషన్ల కోసం తిరుగుతున్న సమయంలో అస్వస్థతకు గురై కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. తెర మీద కనిపించాలనే ఆశ తీరకుండానే ఈ లోకంలో తన పాత్ర పూర్తి కావడంతో అనంత వాయువుల్లో కలిసిపోయాడు. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
సినిమాల్లో నటించాలనే ఆశతో నగరానికి వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందాడు. బంజారాహిల్స్లో గుండెపోటుతో కళాకారుడు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తిని అనకాపల్లికి చెందిన వడపల్లి సంజయ్ (55)గా గుర్తించారు. సినిమాల్లో అవకాశాల కోసం కొన్నాళ్ల క్రితమే సంజయ్ హైదరాబాద్ వచ్చాడు. విద్యానగర్లో ఉన్న బంధువుల ఇంట్లో ఉంటూ ఆడిషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో నేడు సంజయ్.. బంజారాహిల్స్ రోడ్ నం.2 సాగర్ సొసైటీలోని సినిమా కార్యాలయానికి వెళ్లాడు.
అయితే అతడు అక్కడికి చేరుకునేలోపే ఆడిషన్స్ పూర్తయ్యాయని నిర్వాహకులు చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. అయినా పట్టువదలకుండా ఆఫీసుకు వెళ్లి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని వేడుకున్నాడు. అయితే అవకాశం లేదని నిర్వాహకులు చెప్పడంతో.. నిరాశతో వెనుదిరిగాడు. పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అలా కూర్చున్న కాసేపటికే సంజయ్ కుప్పకూలిపోయాడు.
గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్వాహకులు తెలిపారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంజయ్ మృతి గురించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

