- సూర్య సినిమా షోలు అకస్మాత్తుగా రద్దు
- కంటతడి పెట్టుకున్న ఆర్జే బాలాజీ
- సాయంత్రం సినిమా విడుదలపై ఆశలు
Karuppu: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ 'కరుప్పు(Karuppu)' (తెలుగులో 'వీరభద్రుడు') విడుదలైన తొలిరోజే తీవ్ర అడ్డంకులను ఎదుర్కొంటోంది.
ఆర్థిక లావాదేవీలు, ఫైనాన్స్ క్లియరెన్స్ సమస్యల కారణంగా నేడు ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన మార్నింగ్, మ్యాట్నీ షోలు రద్దయ్యాయి. ఎంతో ఆశగా థియేటర్లకు వచ్చిన అభిమానులు షోలు క్యాన్సిల్ కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కొన్ని చోట్ల అభిమానులు థియేటర్ల వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సినిమా విడుదల వాయిదా పడటంతో ఈ చిత్రంతో సంబంధం ఉన్న నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఎమోషనల్ వీడియోను విడుదల చేస్తూ ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పారు. "ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు, ప్రేక్షకులు పడుతున్న ఇబ్బందికి నన్ను క్షమించండి" అంటూ కంటతడి పెట్టుకున్నారు. అనివార్య కారణాల వల్ల షోలు ఆగిపోయాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, సాయంత్రం 6 గంటల కల్లా అన్ని అడ్డంకులు తొలగి సినిమా ఖచ్చితంగా థియేటర్లలోకి వస్తుందని బాలాజీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన పడుతున్న బాధను చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా మద్దతుగా నిలుస్తున్నారు. "మీరు ధైర్యంగా ఉండండి, సినిమా కోసం ఎంత సమయమైనా వేచి చూస్తాం" అంటూ నెటిజన్లు ధైర్యం చెబుతున్నారు. మరి సాయంత్రం షోలకైనా 'వీరభద్రుడు' అడ్డంకులు దాటుకుని వెండితెరపై మెరుస్తాడో లేదో వేచి చూడాలి.

