Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ లో మేము ఓడిపోలేదు, గెలిచాము అని అన్నారు.
అంతేకాదు బెంగాల్ సీఎం పదవికి తాను రాజీనామా చేయను అని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. తాను లోక్ భవన్ కు వెళ్లనని, గవర్నర్ కు రాజీనామా ఇవ్వనని మమత స్పష్టం చేశారు. ఎన్నికల సంఘంపైనా మమత సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి ఈసీ ఏజెంట్ గా మారిందన్నారు. ఈసీ తీరుతో 100 సీట్లు కోల్పోయామన్నారు. తమ ఓట్లు చోరీ చేశారని మమత ఆరోపించారు. బెంగాల్ లో బీజేపీ కుట్రలతో ఫలితాలు తారుమారు అయ్యాయని అన్నారు.
బెంగాల్ లో ఎన్నికల నిర్వహణపై ఘాటు విమర్శలు చేశారు మమత. ఎన్నికలు నిర్వహించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగాల్ లో 100 సీట్లలో తమ గెలుపును దొంగలించారని మమత ఆరోపించారు. మేము ఓడిపోలేదు, మా గెలుపును దొంగలించారు అని విరుచుకుపడ్డారు. తమకు అధికారం లేకపోయినా పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇంత దారుణంగా నిర్వహించిన ఎన్నికలను తాను ఎప్పుడూ చూడలేదన్నారు మమత.
”బెంగాల్ లో పోలీసులు అచేతనంగా ఉండిపోయారు. కేంద్ర బలగాలు ఈసీతో కుమ్మక్కయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల్లో మా అభ్యర్థులను భయాందోళనకు గురి చేశారు. మహిళనైన నాతోనే అనుచితంగా ప్రవర్తించారు. బెంగాల్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఈసీపై ఎలా పోరాడాలో పార్టీలో చర్చించి ముందుకెళ్తాం. మా పార్టీ కార్యాలయాలపైనా దాడులు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పక్షపాతంగా వ్యవహరించింది. కేంద్రం నియంత్రణలో ఎన్నికల సంఘం పని చేసింది. బెంగాల్ లో మేము బీజేపీతో కాదు, ఈసీతో పోరాడాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాతో ఫోన్ లో మాట్లాడారు. ఇండి కూటమిని బలోపేతం చేస్తాం” అని మమతా బెనర్జీ అన్నారు.

