- లీడర్లకు ట్రైనింగ్ క్లాసెస్, ఫ్యూచర్కు బేస్మెంట్
- వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అంటూ దిశానిర్దేశం
- వన్ టు వన్ విత్ లోకేశ్ ..లీడర్లకు డైరెక్షన్స్
- పార్టీ బాగుంటే అందరం బాగుంటామని హితబోధ
Nara Lokesh: పిచ్చాపాటీ కార్యక్రమం కాదు. టైంపాస్ మీటింగ్ అంతకంటే కాదు. ఏదో ప్రాసెస్లో భాగంగా పెట్టిన సమావేశాలు కూడా కావు. వన్ టు వన్ భేటీలు..కోఆర్డినేషన్ క్లాస్లు ..ఇవన్నీ పార్టీకి బలమైన పునాదులు వేయడం కోసమే. జూన్ తర్వాత అందరూ ప్రజాక్షేత్రంలో ఉండాల్సిందేనని దిశానిర్దేశం చేసిన లోకేశ్..సరికొత్త పంథాలతో లీడర్లను పరుగులు పెట్టించే ప్లాన్ చేశారు. అయితే ముఖాముఖి సమావేశాల తర్వాత కూడా కొంత మార్పు వచ్చినా..అక్కడక్కడ కొందరు నేతలు లైట్ తీసుకోవడంపై లోకేశ్ సీరియస్గానే రియాక్ట్ అయ్యారట. ఇంతకు శిక్షణా తరగతుల వెనుక అసలు ప్లానేంటి? లోకేశ్ ఎక్స్పెక్ట్ చేసిందేంటి? లీడర్ల నుంచి వచ్చిన స్పందనేంటి?
పరిస్థితులు మారాయి. పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. రాజకీయ పార్టీల పంథాలు మారుతూ వస్తున్నాయి. పాత పద్దతులు పక్కన పెట్టి..సరికొత్త పంథాలో పార్టీని..నేతలను నడిపించే ప్లాన్ చేస్తున్నారు అధినేతలు. ఇలాంటి ముందస్తు వ్యూహాల్లో టీడీపీ ఓ అడుగు ముందే ఉంటోంది. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ ఎన్నో ఎత్త పల్లాలు దాటుకుని నిలబడింది. పార్టీ పెట్టినప్పుడున్న లీడర్లు ఇప్పుడు సీనియర్లు అయిపోయారు. దీంతో పార్టీకి కొత్త రక్తం ఎక్కించేందుకు యువతకు..కొత్త తరం నాయకులకు అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ క్రమశిక్షణా తరగతులు పెట్టి..పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జులతో సమావేశమైయ్యారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్. కార్యకర్తే అధినేత అనే లైన్తో క్యాడర్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న ఆయనతో..వన్ టు వన్ భేటీలతో తెలుగు తమ్ముళ్లకు దగ్గరయ్యే స్కెచ్ వేస్తున్నారు.
అయితే ఆ మధ్య నిర్వహించిన శిక్షణా తరగతుల్లో..కాఫీ కబుర్లు పేరుతో కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతి ఇద్దరు నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయి డిస్కస్ చేశారు. కార్యకర్తలకు-నాయకులకు కోఆర్డినేషన్ మిస్ కాకుండా..కలిసిగట్టుగా పనిచేయాల్సిన అవసరంపై దిశానిర్దేశం చేశారు. అయితే కొందరు కాఫీ విత్ లోకేశ్ కార్యక్రమాన్ని లైట్ తీసుకుంటున్నట్టు గుసగుసలు వినిపించాయి. తాను అంతలా హితబోధ చేసినా కొందరు నేతల తీరులో ఏ మాత్రం మార్పు లేదని లోకేశ్ దృష్టికి కూడా వెళ్లిందని అంటున్నారు. దీంతో కాఫీ తాగుతూ చెప్పుకున్న కబుర్లు వెనుకున్న వ్యూహమేంటో మరోసారి కార్యకర్తలు, నేతలకు వివరించి చెప్పారట లోకేశ్.
పార్టీకి భవిష్యత్ వ్యూహాలను అమలు చేసే అతి పెద్ద కార్యక్రమం..
వన్ టు వన్ భేటీలు పిచ్చాపాటీ మీటింగ్లు..టైంపాస్ కార్యక్రమం అంతకంటే కాదని..కూడా లోకేశ్ తేల్చి చెప్పారట. పార్టీకి భవిష్యత్ వ్యూహాలను అమలు చేసే అతి పెద్ద కార్యక్రమమని నాయకులకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు తెలుస్తోంది. ఒక కార్యక్రమాన్ని భిన్నంగా నిర్వహిస్తే..దానిని లైట్ తీసుకుంటామంటే ఎలా? అని అసంతృప్తి వ్యక్తం చేశారట. ఈ మధ్య పార్టీ సీనియర్ లీడర్లతో భేటీ అయిన నారా లోకేశ్..కాఫీ తాగుతూ చర్చించిన అంశాలపై రిజల్ట్ ఎంతవరకు వచ్చిందని సమీక్షించారట. క్షేత్రస్థాయిలో జరిగిన మార్పులపై ఆరా తీశారట. చాలా చోట్ల క్యాడర్, లీడర్ల మధ్య దూరం కంటిన్యూ అవుతోందని తెలుసుకుని..తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తనతో జరిగిన ముఖాముఖి సమావేశంలో చెప్పినట్టే కార్యకర్తలు, నేతలు నడుచుకోవాలని..ఏ మాత్రం తేడాలు రావడానికి వీళ్లేదని తేల్చి చెప్పినట్లు డిస్కస్ చేసుకుంటున్నారు.

