- కుటుంబ కలహాలతో దారుణ హత్య
- బామ్మర్ది చేతిలో సజీవ దహనం
- కాపాడబోయిన మహిళ కూడా మృతి
Punjab Incident: కుటుంబ కలహాలు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో నిరూపించే అత్యంత అమానుషమైన ఘటన పంజాబ్(Punjab Incident)లోని తార్న్ తారన్ జిల్లాలో వెలుగుచూసింది.
గత నెలలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ తాజాగా బయటకు రావడంతో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవను సర్దుబాటు చేయడానికి అత్తవారింటికి వెళ్లిన ఒక వ్యక్తిని, అతని బామ్మర్ది అత్యంత క్రూరంగా సజీవ దహనం చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. తార్న్ తారన్ పరిధిలోని సంఘా గ్రామానికి చెందిన లవ్ప్రీత్ సింగ్, అతని భార్య సందీప్ కౌర్ మధ్య ఇటీవల వివాదం నడిచింది. దీంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోగా, భార్యను ఒప్పించి ఇంటికి తీసుకెళ్లేందుకు లవ్ప్రీత్ సింగ్ జూన్ 13న ఆమె స్వగ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతని బామ్మర్ది సాజన్ సింగ్ ఆగ్రహంతో ఊగిపోతూ, లవ్ప్రీత్పై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. ఈ పెనుగులాటలో లవ్ప్రీత్ను కాపాడటానికి నిందితుడి వదిన గుర్జీత్ కౌర్ ప్రయత్నించింది.
అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో గుర్జీత్ కౌర్ కూడా మాటల్లో చిక్కుకుంది. దాంతో, లవ్ప్రీత్, గుర్జీత్ ఇద్దరూ చాలా వరకు కాలిపోయారు. అనంతరం వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో నిందితుడు సాజన్ సింగ్కు సైతం గాయాలు కావడంతో అతను కూడా ఆసుపత్రిలో చేరాడు. తాజాగా లభ్యమైన సీసీటీవీ ఫుటేజీలో సదరు వ్యక్తిపై నిప్పు అంటించడం, రక్షించబోయిన మహిళ కూడా మంటల్లో చిక్కుకోవడం స్పష్టంగా రికార్డయ్యింది. తార్న్ తారన్ సాదర్ పోలీసులు ఈ ఘటనపై సాజన్ సింగ్పై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

