Rajasthan Sand Storm: ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. చురు, బికనీర్ లో భారీ ఇసుక తుఫాన్ చోటు చేసుకుంది. ఇసుక తుఫాన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. అనేక చెట్లు నేలకూలాయి. అరగంట పాటు ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది.
చురు, బికనీర్, భరత్ పూర్ తదితర ప్రాంతాలపై ఈ ఇసుక తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి ఇసుక తుఫాన్ నగరాలను కమ్మేసింది. ఇళ్లు, వ్యవసాయ పొలాలు, రోడ్లు అన్నీ ఇసుకతో నిండిపోయాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇసుక తుఫాన్ బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. అందులో ఇసుక తుఫాన్ సృష్టించిన బీభత్సం చూసి అంతా భయపడిపోతున్నారు.
శనివారం రాజస్థాన్లోని చురులో భారీ నలుపు-పసుపు ధూళి తుఫాను వీచింది. దట్టమైన ఇసుక మేఘాలు భూభాగాన్ని కప్పేయడంతో, ఆ ప్రాంతం మొత్తం అంధకారం కమ్ముకుంది. విజిబులిటీ తీవ్రంగా తగ్గిపోయింది. మధ్యాహ్నం బికనీర్లో కూడా ఒక తీవ్రమైన తుఫాను భారీ ధూళి గోడను సృష్టించింది. ఎడారి రాష్ట్రంలో మరోసారి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
పశ్చిమ ఆటంకం (వెస్ట్రన్ డిస్ట్రబెన్స్) ప్రభావం కారణంగా రాబోయే కొద్ది రోజుల్లో రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, దుమ్ము తుఫానులు, వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్డి) తెలిపింది. గత 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ధోల్పూర్లోని బారిలో అత్యధికంగా 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
బికనీర్, జైపూర్, అజ్మీర్, భరత్పూర్, కోటా, జోధ్పూర్, ఉదయ్పూర్ డివిజన్లలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని జైపూర్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే నాలుగైదు రోజుల పాటు అస్థిర వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని కారణంగా, చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44°C కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.

