Rajiv Yuva Vikasam : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమైన హామీల్లో ఒకటి రాజీవ్ యువ వికాసం పథకం. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశం కల్పించేందుకు బ్యాంకు రుణం మంజూరు చేస్తారు.
పథకం కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన ప్రకటన, అమలు వంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటే తాజాగా రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 91 వేల మందికి రాజీవ్ యువ వికాసం ద్వారా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ లబ్ధిదారులు ఎవరంటే.. గిరిజన యువత.
రాష్ట్రంలో గిరిజనుల ఆర్థికాభివృద్ధికి రేవంత్ సర్కార్ రూ.2546.24 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్లు.. ట్రైకార్ ఎండీ తెలిపారు. ప్రభుత్వం ఆమోదించిన ఈ మొత్తంలో రూ.2085 కోట్ల సబ్సిడీ కాగా.. మిగతా మొత్తం రూ.461.24 కోట్ల బ్యాంకు రుణం. శుక్రవారం ట్రైకార్ బోర్డు సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. ఈ వార్షిక ప్రణాళికతో 1,36,184 మంది గిరిజన యువతకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోబోతున్నట్లు వివరించారు. ఇందిరా సౌరగిరి జలవికాసం, రాజీవ్ యువవికాసం, గ్రామీణ రవాణా పథకం, ఆదిమ గిరిజనులకు జీవనోపాధి, గిరిజన రైతులకు యాంత్రీకరణ పథకం, సీఎంఎస్టీఈఐ (CMSTEI), క్యూర్ ప్రాంతంలో ఆటోల రెట్రోఫిటింగ్, నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు వంటివి ఉంటాయని తెలిపారు.
1.రాజీవ్ యువవికాసం కింద 91,687 మంది ఎస్టీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.1225.79 కోట్లు కేటాయించారు. ఇందులో రాయితీ రూ.1000 కోట్లు, మిగతా రూ.225.79 కోట్లు బ్యాంకు రుణం.
2.అలానే 13,897 మందికి జీవనోపాధి పథకం అమలు చేయబోతున్నారు. ఇందుకుగాను రూ.521.24 కోట్లు ఖర్చు చేయనుండగా.. దీనిలో బ్యాంకు రుణం 311.24 కోట్లు. ఇందులో రాయితీ రూ.210 కోట్లు.
3.అలానే క్యూర్ ఏరియాలో 7,500 మంది లబ్ధిదారుల ఆటోలను నూరుశాతం రాయితీతో.. రెట్రోఫిటింగ్ పథకం కింద పూర్తి స్థాయి విద్యుత్తు వాహనాలుగా మార్చుతారు. ఇందుకు గాను రూ.150 కోట్లు వ్యయం చేయనున్నారు.
4.సీఎంఎస్టీఈఐ (CMSTEI) పథకం ద్వారా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించనున్నారు. దీని కోసం 100 యూనిట్లు మంజూరు చేయనున్నారు. మొత్తం రూ.200 కోట్లతో పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఇందులో సబ్సిడీ రూ.50 కోట్లు, బ్యాంకు రుణం రూ.130 కోట్లు. అయితే ఈ పథకంలో లబ్ధిదారులు కూడా రూ.20 కోట్ల మేర భరించాల్సి ఉంది.
5.ప్రభుత్వం గిరిజన యువత నైపుణ్యాభివృద్ధి కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో 13,000 మంది లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ అందిస్తుంది.
అలానే ఇందిరా జలవికాసం కింద 10,000 మంది లబ్ధిదారులకు రూ.600 కోట్ల ఖర్చుతో సోలార్ బోరుబావులతో పాటు పోడు భూములను సాగుయోగ్యంగా మార్చి నీటివసతి కల్పిస్తుంది.
ఇదిలా ఉంటే రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం కింద:
- రూ.50 వేల వరకు పూర్తి సబ్సిడీ వర్తిస్తుంది.
- రూ.50,001 నుంచి రూ.లక్ష వరకు అయితే 90 శాతం సబ్సిడీ లభిస్తుంది.
- అలానే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం,
- రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ లభిస్తుంది.

