- రేషన్ బియ్యం నాణ్యత పెంపు
- నూకల శాతం భారీ తగ్గింపు
- కోట్లాది పేదలకు గొప్ప మేలు
Ration Rice Quality: దేశంలోని రేషన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేసే బియ్యం నాణ్యతను గణనీయంగా పెంచాలని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు, లబ్ధిదారులకు మెరుగైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నూతన నిర్ణయం ప్రకారం రేషన్ బియ్యం(Ration Rice Quality)లో నూకల శాతాన్ని భారీగా తగ్గించనున్నారు. సాధారణ బియ్యంలో ఇప్పటివరకు 25 శాతంగా ఉన్న నూకల శాతాన్ని ఇకపై 10 శాతానికి పరిమితం చేయనున్నారు. అదేవిధంగా ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) లో నూకల శాతాన్ని 16 శాతం నుండి ఏకంగా 5 శాతానికి కుదిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ వివరాలను వెల్లడిస్తూ, దేశంలోని 80 కోట్లకు పైగా ఉన్న నిరుపేద లబ్ధిదారులకు ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. పేద ప్రజల ఆరోగ్యానికి, వారి ఆహార హక్కుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తమ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక అడుగు వేసిందని ఆయన వివరించారు.

