- మే 31న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్
- కప్పు కోసం పోటీపడనున్న ఆర్సీబీ, గుజరాత్
- వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి అన్న దానిపై అందరి దృష్టి
RCB vs GT : ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. ఆదివారం (మే 31) అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్లో కప్పు కోసం పోటీపడుతుండడం గమనార్హం.
క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను 92 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆర్సీబీ ఫైనల్కు వచ్చింది. ఇక క్వాలిఫయర్-1లో ఓడిపోయినప్పటికి కూడా క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ పై అద్భుత విజయం సాధించి గుజరాత్ ఫైనల్కు చేరుకుంది. కాగా.. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి.
ఒక వేళ వర్షం పడి మ్యాచ్ రద్దేతే పరిస్థితి ఏంటి? కప్పును ఇద్దరికి ఇస్తారా? లేదంటే ఎవరికి ఇస్తారు అన్న ఆసక్తి అందరిలో ఉంది.
లీగ్ మ్యాచ్ల్లో వర్షం పడి మ్యాచ్ రద్దైన సందర్భంలో ఇరు జట్లకు చెరో పాయింట్ను కేటాయించడాన్ని చూశాం. అయితే.. ఫైనల్ మ్యాచ్కు అలాంటి అవకాశం లేదు. కానీ.. రిజర్వ్ డే అందుబాటులో ఉంది. అంటే.. నిర్ణయించిన తేదీన ఫైనల్ మ్యాచ్ జరగని పక్షంలో ఆ మరుసటి రోజును నిర్వహించే వీలుంది.
మే 31న మ్యాచ్ మధ్యలో వర్షం పడి.. ఆ రోజు నిర్వహించలేని పరిస్థితి ఉంటే ఆ మరుసటి రోజు అంటే జూన్ 1న మ్యాచ్ను నిర్వహిస్తారు. కానీ ముందు రోజు ఎక్కడతే ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ మ్యాచ్ను కంటిన్యూ చేస్తారు. ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడి ఇరు జట్లు కనీసం ఐదు ఓవర్లు కూడా మ్యాచ్ ఆడలేని పరిస్థితి ఉంటే అప్పుడు మ్యాచ్ను రద్దు చేస్తారు.
విజేతను ఎలా ప్రకటిస్తారంటే?
ఫైనల్ రోజు, రిజర్వ్ డే రోజు మ్యాచ్ ను నిర్వహించలేని పరిస్థితి ఉంటే అప్పుడు మ్యాచ్ను రద్దు చేస్తారు. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. లీగ్ దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అగ్రస్థానంలో ఉండగా గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఫైనల్ మ్యాచ్ రద్దైతే ఆర్సీబీని విజేతగా ప్రకటిస్తారు.
ఇదిలా ఉంటే.. అక్యూ వెదర్ ప్రకారం ఫైనల్ మ్యాచ్కు ఎలాంటి వర్షం ముప్పు లేదు. వాతావరణం చాలా క్లియర్ ఉంటుందని తెలిపింది.

