Sai Marthand : ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాతో భారీ విజయం సాధించాడు కొత్త దర్శకుడు సాయి మార్తాండ్. చిన్న సినిమాగా ఒక యూత్ ఫుల్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా అన్ని జనరేషన్స్ ని మెప్పించింది.
ఈ ఒక్క సినిమాతో దర్శకుడు సాయి మార్తాండ్ కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. తన తర్వాతి సినిమా అడివి శేష్ తో ప్రకటించాడు.
తాజాగా సాయి మార్తాండ్ తన బ్యాక్ గ్రౌండ్ ని బయటపెట్టాడు. ఎన్టీఆర్ పేరిట ఇచ్చే ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న సాయి మార్తాండ్ తన తాతయ్య బివి ప్రసాద్ దర్శకుడిగా ఎన్టీఆర్ తో మూడు సినిమాలు చేసారని చెప్పుకొచ్చాడు. దీంతో సాయి మార్తాండ్ తాతయ్య ఎవరా అని వెతుకులాట మొదలయింది.
సాయి మార్తాండ్ తాతయ్య బివి ప్రసాద్ దర్శకుడిగా 1965 నుంచి దాదాపు 20 సినిమాలకు పైగా చేసారు. ఎన్టీఆర్ తో ఆరాధన, మేలుకొలుపు, మనుషుల్లో దేవుడు సినిమాలు చేసారు. చిరంజీవితో తాతయ్య ప్రేమలీలలు అనే సినిమా చేసారు. కృష్ణతో చుట్టాలున్నారు జాగ్రత్త, నాయుడు గారి అబ్బాయి, శోభన్ బాబుతో ఊరికి సోగ్గాడు.. లాంటి సినిమాలు చేసారు. ఇలా అప్పటి నటీనటులతో దర్శకుడిగా సినిమాలు చేసారు బివి ప్రసాద్. ఆయన తీసిన మట్టిలో మాణిక్యం అనే సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.
అప్పట్లో తాతయ్య స్టార్స్ తో దర్శకుడిగా పనిచేస్తే ఇప్పుడు మనవడు కూడా దర్శకుడిగా మారి సినిమాలు తీయడం గమనార్హం.

