- భోగాపురం ఎయిర్పోర్ట్ వివాదం
- చంద్రబాబు క్రెడిట్ చోరీ
- జగన్ శ్రమ అనివార్యం
Sajjala Ramakrishna Reddy: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో అసలు శ్రమ అంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని, కూటమి ప్రభుత్వం కేవలం పక్క దారిలో క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అందరూ మనస్ఫూర్తిగా స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండేళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పూర్తయిన సంక్షేమ, అభివృద్ధి సంక్షేమ ఫలాలను తన ఖాతాలో వేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని సజ్జల ఆరోపించారు.
గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హడావుడిగా ఒక శంకుస్థాపన బండ రాయి వేసి ప్రాజెక్టును గాలికి వదిలేశారని సజ్జల విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే 15 వేల ఎకరాల భూసేకరణను రీ-డిజైన్ చేసి 2700 ఎకరాలకు తగ్గించి పనులను వేగవంతం చేశారని గుర్తుచేశారు. జీఎంఆర్ సంస్థతో ఒప్పందాలు, అన్ని రకాల పర్యావరణ అనుమతులు తెచ్చి 2023లో వైఎస్ జగన్ అసలైన శంకుస్థాపన చేశారని తెలిపారు. 2026 నాటికి విమానాశ్రయం పూర్తవుతుందని జగన్ ఆనాడే స్పష్టంగా చెప్పారని, కోవిడ్ మహమ్మారి రాకపోయి ఉంటే వైఎస్సార్సీపీ హయాంలోనే ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చేదని సజ్జల వివరించారు.
అలాగే ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీగా ఉండే 55 కిలోమీటర్ల నేషనల్ హైవే రోడ్డుకు సంబంధించి కేంద్ర అనుమతులు తెచ్చింది కూడా జగన్ సర్కారేనని ఆయన అన్నారు. గత కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ల వ్యవధిలో ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా సరిగ్గా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. భూసేకరణ సమయంలో నరసాయమ్మ అనే మహిళ అన్న మాటలను జగన్ ఉటంకిస్తే, దాన్ని వక్రీకరించి జగన్ మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కు వ్యతిరేకమని విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, భోగాపురం ప్రాజెక్ట్ వెనుక ఉన్న నిజమైన శ్రమ జగన్దేనని సజ్జల ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

