Southwest Monsoon : రికార్డు స్థాయి వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతోపాటు ఉక్కపోతతో కొద్దిరోజులుగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే, ప్రజలకు ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ చల్లని కబురు తీసుకొచ్చింది.
నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం కేరళ, తమిళనాడులోకి ప్రవేశించిన రుతుపవనాలు.. మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎర్నాకుళం, కొట్టాయం, అలప్పుళ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. తమిళనాడు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.
వాస్తవానికి.. మే నెల చివరి నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ, నైరుతిరాక ఆలస్యమైంది. తాజాగా గురువారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే వారం రోజుల్లోపే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

