- NCLT తీర్పుపై తీవ్ర అభ్యంతరాలు
- వేల కోట్ల అప్పుల సడలింపు
- అప్పీలేట్ కోర్టుకు బ్యాంకుల పయనం
Subhash Chandra: జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రతిపాదనకు జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ (ఎన్సిఎల్టి) ఆమోదం తెలపడం దేశీయ కార్పొరేట్, బ్యాంకింగ్ వర్గాల్లో నభూతో నభవష్యత్ అన్న రీతిలో సంచలనం సృష్టిస్తోంది.
ఆయనపై దాఖలైన రూ. 22,006 కోట్ల భారీ క్లెయిమ్లను కేవలం రూ. 6.25 కోట్లు చెల్లించి పరిష్కరించుకోవడానికి అనుమతించడం తీవ్ర కలకలానికి దారితీసింది. సామాన్యుడు చిన్న రుణం కట్టకపోతే జప్తులు చేసే బ్యాంకింగ్ వ్యవస్థ, శతకోటీశ్వరులకు వేల కోట్ల మాఫీకి మార్గం సుగమం చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ మాల్యా ఘాటు వ్యాఖ్యలు – వడ్డీ లెక్కల రగడ:
ఈ వివాదం సద్దుమణగక ముందే ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా చేసిన వ్యాఖ్యలు మంటలకు మరింత ఆజ్యం పోశాయి. కోర్టు ఆదేశాల ప్రకారం తాను కట్టాల్సిన అసలు బకాయి రూ. 6,203 కోట్లు మాత్రమేనని, కానీ ప్రభుత్వం తన ఆస్తులను అమ్మేసి ఏకంగా రూ. 14,100 కోట్లు గుంజినా ఇంకా వేధిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే దశాబ్ద కాలంగా పేరుకుపోయిన వడ్డీలను మాల్యా లెక్కలోకి తీసుకోకపోవడం, పార్లమెంట్లో ఇచ్చే నివేదికలకు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లకు మధ్య ఉన్న రూ. 4,000 కోట్ల వ్యత్యాసం ప్రస్తుతం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది.
ఐబిసి చట్టంలో లొసుగులు – ప్రభుత్వ డిఫెన్స్:
దివాలా స్మృతి (IBC) అమలుతీరుపై వ్యక్తమవుతున్న విమర్శలను ప్రభుత్వం ఖండిస్తున్నప్పటికీ, చట్టంలోని లొసుగులే కార్పొరేట్ దిగ్గజాలకు వరంలా మారాయన్నది బహిరంగ రహస్యం. సుభాష్ చంద్ర(Subhash Chandra) కేవలం గ్యారంటీర్ మాత్రమేనని, ఆయన ఆధ్వర్యంలోని కంపెనీలు రూ. 1,494 కోట్లు కడితే సరిపోతుందని కోర్టు పేర్కొనడం ప్రజాధనాన్ని తుడిచిపెట్టడమేనని నిపుణులు మండిపడుతున్నారు. చంద్ర నికర ఆస్తి విలువ గతంలో వేల కోట్లలో ఉండి, ఇప్పుడు సడన్గా రూ. 31.79 కోట్లకు పడిపోవడం వెనుక ఉన్న మతలబుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోర్టు గుమ్మం తొక్కనున్న ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి బ్యాంకులు:
ఎన్సిఎల్టి ఇచ్చిన ఈ అనుకూల తీర్పును అంగీకరించేందుకు రుణాలు ఇచ్చిన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పూర్తిగా నిరాకరించాయి. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని, ఆచరణ సాధ్యం కానిదని స్పష్టం చేస్తూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సిఎల్ఎటి)లో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యాయి. కంపెనీ అప్పులకు వ్యక్తిగతంగా తానెలా బాధ్యత వహిస్తానని చంద్ర ప్రశ్నిస్తుండటంతో, ఈ వేల కోట్ల రుణాల వ్యవహారం పైకోర్టుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

