- లక్నోతో మ్యాచ్లో నో బాల్ వేసిన బుమ్రా
- బతికి పోయిన లక్నో బ్యాటర్ హిమ్మత్ సింగ్
- దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కామెంటేటర్ సునీల్ గవాస్కర్
Sunil Gavaskar : ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది.
సోమవారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే.. మ్యాచ్ సమయంలో జస్ప్రీత్ బుమ్రా చేసిన ఓ తప్పుపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ అంతర్జాతీయ క్రికెటర్గా బుమ్రా ఇలాంటి తప్పు అసలు చేయకూడదని, తాను ఎట్టి పరిస్థితుల్లో అతడిని క్షమించేది లేదని చెప్పుకొచ్చాడు.
అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ను బుమ్రా వేశాడు. ఈ ఓవర్లోని ఓ బంతిని లక్నో బ్యాటర్ హిమ్మత్ సింగ్ షాట్ ఆడగా ర్యాన్ రికెల్టన్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో వికెట్ పడిందన్న ఆనందంలో బుమ్రా ఉండగా.. థర్డ్ అంపైర్ అది నో బాల్ అని చెబుతూ సైరన్ మోగించాడు. దీంతో బుమ్రా ఆనందం కేవలం క్షణ కాలానికే పరిమితమైంది.
అంతటి కీలకమైన సమయంలో బుమ్రా నోబాల్ వేయడం పై కామెంట్రీ చేస్తున్న సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నాడు. ‘ఇది ఆయోదయోగ్యం కాదు. మీరు ఓ ప్రొఫెషనల్ క్రికెటర్. వైడ్లు వేశారంటే నేను అర్థం చేసుకోగలను. కానీ నో బాల్స్ కాదు.’ అని గవాస్కర్ అన్నారు. ఇక ఈ మ్యాచ్లో బుమ్రా 4 ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు..
నికోలస్ పూరన్ (63; 21 బంతుల్లో 1 ఫోర్, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, మిచెల్ మార్ష్ (44; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీశాడు. ఘజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం ర్యాన్ రికెల్టన్ (83; 32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు), రోహిత్ శర్మ(84; 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది.

