Telangana Heat Wave : తెలంగాణలో హీట్ వేవ్ కొనసాగుతోంది. తీవ్రమైన వడగాడ్పులతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొని ఉంది.
వడగాడ్పుల తీవ్రత ఇలానే కొనసాగనున్న నేపథ్యంలో తెలంగాణ వాతావరణ శాఖ పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం.. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నేడు 44°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలానే హైదరాబాద్లోనూ 41-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలానే నేడు రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో హీట్ వేవ్ కొనసాగనుందని తెలిపింది. కనుక ప్రజలు మధ్యాహ్న వేళల్లో బయట తిరగవద్దని సూచించింది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, ఈదురుగాలులు వీచేందుకు అవకాశం ఉందని ప్రకటించింది.
ఇదిలా ఉంటే కొన్ని జిల్లాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నేడు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసేందుకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అలానే ఈ జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఇవాళ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు నిజామాబాద్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.

