- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- రాష్ట్రంలో కూడా వాలంటీర్లు
- 30 వేల మంది సాయిల్ హెల్త్ వాలంటీర్లు
Telangana Soil Health Volunteers : వాలంటీర్లు అనగానే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తుంది.
గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. అక్కడ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టాడు. వీరి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్ని నేరుగా లబ్ధిదారులకు అందేవి. వాలంటీర్ల వ్యవస్థకు మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో కూడా వాలంటీర్ల వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించుకుంది.
అయితే వీరు సచివాలయ వాలంటీర్ల మాదిరి కాదు. తెలంగాణ సర్కార్ నియమించబోయే వాలంటీర్లు.. కేవలం రైతుల కోసమే. అన్నదాతల కోసం తెలంగాణ సర్కార్ సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమించబోతున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి 3 వాలంటీర్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 వేల మంది వాలంటీర్లను నియమించేందుకు సర్కార్ సిద్ధమయ్యింది.
ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్లు ఆయా రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న రైతులకు వారి సేవలందిస్తారు. భూసారం కాపడటానికి తీసుకోవాల్సిన చర్యలు.. పంటకు అనుకూలంగా భూమిని ఎలా మార్చుకోవాలి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలి అనే అంశాలపై రైతులకు సూచనలు చేస్తారు. అయితే ఈ అంశాలపై ముందుగా వాలంటర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే తొలి విడతగా.. కొందరు వాలంటీర్లకు ఇక్రిశాట్ లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఇక్రిశాట్, తెలంగాణ వ్యవసాయ శాఖ ఈ వాలంటీర్లను నియమించనుంది. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి ఎంపికైన వాలంటీర్లకు ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు. వీరికి భూసారం, పంటల సాగు లాంటి అన్ని విషయాలపై ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ పూర్తయిన వెంటనే వీరు విధుల్లో జాయిన్ అవుతారు.

