- 'తల్లికి వందనం'పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
- అర్హులై సాయం అందని వారికి మరో అవకాశం
- ఈనెల 7వరకు వినతుల స్వీకరణ
Thalliki Vandanam Scheme: ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రతీయేటా తల్లికి వందనం పథకం కింద నిధులు జమ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15వేలు జమ చేస్తుండగా.. తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున జమ చేస్తోంది. ఇప్పటికే 2026-27 విద్యా సంవత్సరంకు చెందిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. అయితే, పథకంకు అర్హత ఉన్నా డబ్బులు పడని వారికి, కొత్త వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
తల్లికి వందనం పథకం అందని వారికి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువు ఈ నెల 3తో ముగియగా దాన్ని ఈనెల 7వరకు పొడిగించింది. అర్హుల జాబితాలో పేరు లేకపోతే శుక్రవారంలోపు స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. అలాగే బ్యాంకు ఖాతా NPCIకి లింక్ అయిందో లేదో సరిచూసుకోవాలి. ప్రభుత్వం ఫిర్యాదులను పరిశీలించి డబ్బులు జమ చేస్తుంది.
ఇప్పటికే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలను ప్రదర్శించారు. అర్హులు ఉంటే అందుకు అవసరమైన సమాచారంతో వినతుల సమర్పణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ విధంగా ఆయా కార్యాలయాలకు వచ్చిన వినతులను పరిశీలించి కొత్తగా అర్హులను గుర్తించి జాబితా తయారు చేస్తారు. ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించినందున తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

