TIMS Sanath Nagar : నగర వాసులు ఎంతో కాలంగా ఆత్రుతగా ఎదురు చూస్తోన్న సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ నగరంలో.. సనత్నగర్లో నిర్మిస్తోన్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రేవంత్ సర్కార్ చర్యలు వేగవంతం చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. మే 1, ఈ శుక్రవారం నుంచి ఆసుపత్రిలో ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. ఇందుకోసం తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని సమాచారం. ఈ ఆసుపత్రి ద్వారా నగరవాసులకు సేవలు అందించేందుకు ఇప్పటికే ఈ హాస్పిటల్లో అవసరమైన వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని కూడా నియమించింది.
మే 1న ప్రారంభం కాబోయే టిమ్స్ ఆసుపత్రి ట్రయల్ రన్ సుమారు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రోగులకు.. అవుట్ పేషెంట్ (OP), డయాగ్నసిస్ సేవలను అందించబోతున్నారు. వీటితో పాటు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ వంటి కీలక విభాగాలతో సహా మొత్తం 22 విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు ఈ ట్రయల్ రన్ కాలంలో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ట్రయల్ రన్ ద్వారా ఆసుపత్రి పనితీరును పరిశీలించి, త్వరలోనే పూర్తిస్థాయిలో వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.

