- మరోసారి తొంభైల్లోనే ఔట్ అయిన సూర్యవంశీ
- డగౌట్లో కెప్టెన్ రియాన్ పరాగ్ క్లాస్
Vaibhav Sooryavanshi : రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వరుసగా రెండో మ్యాచ్లోనూ సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు.
బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 97 పరుగుల వద్ద ఔట్ కాగా.. తాజాగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో 96 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. రెండు మ్యాచ్లోనూ అతడు తొంబైల్లోనే ఔట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు.
గుజరాత్తో మ్యాచ్లో 47 బంతులు ఆడిన వైభవ్ 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేశాడు. రబాడ బౌలింగ్లో థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్కు యత్నించి బౌండరీ లైన్ వద్ద ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్కు చేరుకున్నాడు.
ఇక వైభవ్ ఔట్ అయిన తరువాత డగౌట్కు చేరుకున్నాడు. ఆ వెంటనే రియాన్ పరాగ్ అతడితో సీరియస్గా చర్చించినట్లుగా కనిపిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు సరాదాగా కామెంట్లు చేస్తున్నారు. నీకు నేను మొన్ననే చెప్పానుగా సెంచరీ చేసుకోమని, మళ్లీ ఈ రోజు కూడా అలాగే షాట్ ఆడి ఔట్ అయ్యావు. నీకు అర్థమవుతుందా? లేదా? అని వైభవ్ సూర్యవంశీతో పరాగ్ అన్నట్లుగా నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 96 పరుగులు) రవీంద్ర జడేజా (35 బంతుల్లో 45 పరుగులు), డోనోవన్ ఫెరీరా (11 బంతుల్లో 38నాటౌట్) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు సాధించారు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Riyan Parag : నా వల్ల కాలేదు.. బుడ్డోడే కప్పును అందిస్తాడు.. రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్..
ఆ తరువాత శుభ్మన్ గిల్ (53 బంతుల్లో 104 పరుగులు) శతకం, సాయి సుదర్శన్ (32 బంతుల్లో 58 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మలు తలా ఓ వికెట్ తీశారు.

