Vaibhav Sooryavanshi : చిన్నవయస్సులోనే టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్న యువ సంచలనం, సిక్సర్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
విద్యార్థుల చదువులకు సాయం అందించేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించాడు. తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువు కోసం వినియోగిస్తానని చెప్పాడు. అలాంటి విద్యార్థులు లేదా వారి గురించి తెలిసిన వారు తనను సంప్రదించాలని కోరాడు.
వైభవ్ సూర్యవంశీ శుక్రవారం (ఆగస్టు 28న) తన అధికారిక ట్విటర్ (ఎక్స్) ఖాతా ద్వారా ''గొప్ప విషయాలు రాబోతున్నాయి.. అలాగే చూస్తూ ఉండండి'' అంటూ పోస్టు పెట్టాడు. దీంతో సూర్యవంశీ ఏం చెబుతాడోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. గంటల వ్యవధిలోనే అంటే.. శనివారం ఉదయం తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
'నాకు ఎక్స్ (ట్విటర్) ప్లాట్ఫామ్ నుంచి వచ్చే ఆదాయాన్ని అవసరమైన విద్యార్థుల చదువుకు వెచ్చించాలని భావిస్తున్నా. అర్హత కలిగిన వారు సంప్రదించండి. పాఠశాల, కళాశాలకు సంబంధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి సాయంగా ఉంటా. నాకు తోచినరీతిలో మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా '' అంటూ వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.
ఈ పోస్టు చూసిన నెటిజన్లు వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిన్నవయస్సులోనే గొప్ప ఆలోచన చేసేందుకు అభినందనలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. వైభవ్ పాఠశాల విద్య ఇంకా పూర్తికాలేదు. అతడు ప్రస్తుతం 10వ తరగతి విద్యార్ది. క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు ఈ ఏడాది బోర్డు పరీక్షలను వాయిదా వేసుకున్నాడు.వైభవ్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. అయితే, వైభవ్ చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. ప్రతిఒక్కరూ అతడిని ప్రశంసిస్తున్నారు.

