పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఊహించని రీతిలో దూసుకుపోతోంది. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గానూ, మధ్యాహ్నం వరకు అందిన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 176 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (148)ను బీజేపీ సునాయాసంగా దాటేయడంతో, బెంగాల్ గడ్డపై మొదటిసారి కమల జెండా ఎగరడం దాదాపు ఖాయమైందనే అంచనా వేస్తున్నారు. తుది ఫలితాలు వెలువడనప్పటికీ, ప్రస్తుత మెజారిటీ చూస్తోంటే దశాబ్ద కాలానికి పైగా సాగిన మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికే దిశగా ఓటర్లు తీర్పునిచ్చినట్లు కనిపిస్తోంది.
వెనుకంజలో టీఎంసీ.. కనుమరుగైన కాంగ్రెస్ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఈసారి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం టీఎంసీ కేవలం 94 స్థానాలకే పరిమితమై వెనుకంజలో ఉంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క స్థానంలో కూడా ఆధిక్యాన్ని ప్రదర్శించలేక పూర్తిగా చతికిలపడగా, టీఎంసీ మిత్రపక్షమైన BGPM కేవలం ఒక స్థానంలో ముందంజలో ఉంది. ఈ ఫలితాలు బెంగాల్లో ద్విముఖ పోరులో బీజేపీ పూర్తి పైచేయి సాధించిందని స్పష్టం చేస్తున్నాయి.కీలక నియోజకవర్గాల్లో హోరాహోరీరాష్ట్రవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తున్నప్పటికీ, కొన్ని కీలక స్థానాల్లో ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారిపై ఐదు రౌండ్ల ముగిసేసరికి 16,706 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. అయితే, నందిగ్రామ్లో మాత్రం బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక పానిహతిలో బీజేపీ తరపున బరిలోకి దిగిన ఆర్.జి. కర్ బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్ 5,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉండటం విశేషం.తుది ఫలితం దిశగా కౌంటింగ్ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే బెంగాల్లో అధికార మార్పిడి ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీఎంసీ కంచుకోటలను బద్దలు కొడుతూ బీజేపీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏకపక్షంగా దూసుకుపోతోంది. కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో, సాయంత్రానికి పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం చేపట్టిన ప్రచారం బెంగాల్ ఓటర్లను విశేషంగా ఆకట్టుకుందని ఈ ట్రెండ్స్ నిరూపిస్తున్నాయి.

