రాష్ట్ర పరిపాలనలో అత్యున్నత స్థాయి వేదిక 'మంత్రివర్గ సమావేశం' (Cabinet Meeting). ఒకప్పుడు దీనికో క్రమశిక్షణ, గుట్టు, గంభీరత ఉండేవి.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే, అధికారులు ఐదు నిమిషాల ముందే ఫైళ్లతో సిద్ధంగా ఉండేవారు. కానీ, ఇటీవల సచివాలయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు "అధికార యంత్రాంగంలో పట్టు సడలుతోందా?" లేక "అధికారుల ధీమా మరీ ఎక్కువైందా?" అనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు రెవ్యూలంటే హడలిపోయే అధికారులు ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదు. ఐఎఎస్ లలో ఎందుకింత స్తబ్ధత ఏర్పడిందనేది ఇవాళ సచివాలయంలో చర్చనీయాంశంగా సాగింది.
సకాలంలో రాని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక బలమైన కారణాలు, గత పరిణామాలను విశ్లేషిస్తే ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి.
మారిన పనితీరు- తగ్గిన భయం?
ముఖ్యమంత్రినో, మంత్రినో చూసి ఐఎఎస్ లు భయపడాల్సిన పని లేదు. నిబంధనల ప్రకారం ఎవరి బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరమైతే ఉంది.
గతంలో చంద్రబాబు నాయుడు అంటే టెక్నాలజీ, రివ్యూ మీటింగ్లు, నిరంతర పర్యవేక్షణకు మారుపేరు. అప్పట్లో అధికారులకు ఆయన "టాస్క్ మాస్టర్". కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో కీలక శాఖల కార్యదర్శులు సీఎం నిర్దేశించిన సమయానికి రాకపోవడం అనేది పరిపాలనా పరంగా ఒక గందరగోళ పరిస్థితిని సూచిస్తోంది.
సమాచార లోపం...
సీఎం కార్యాలయం (CMO) నుంచి అధికారులకు సమాచారం వెళ్లడంలో జాప్యం జరుగుతోందా? లేదా అధికారులు దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారా? అన్నది ప్రశ్నార్థకం.
సాధారణంగా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అధికారుల్లో ఉండే "అలర్ట్ నెస్", క్రమంగా పాత పద్ధతులకు మళ్లుతున్నట్లు కనిపిస్తోంది.
గతంలో "బాబు" స్టైల్ ఎలా ఉండేది?
చంద్రబాబు నాయుడు గత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో (ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో) అధికారుల విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. ఉదయం 6 గంటలకే టెలి కాన్ఫరెన్స్లతో కలెక్టర్లను, ఎస్పీలను అప్రమత్తం చేసేవారు.
ఏ అధికారి అయినా సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా మీటింగ్కు వస్తే, అందరి ముందూ క్లాస్ తీసుకునేవారు.
1995-2004 మధ్య కాలంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చంద్రబాబు సమీక్షా సమావేశాలకు హాజరయ్యే ముందు హోంవర్క్ చేయకుండా వెళ్లడానికి భయపడేవారు.
ప్రస్తుత వివాదానికి కారణాలు..
ఇంధన పొదుపు అనేది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. దీనిపై చర్చించాలని ముందుగానే నిర్ణయించినా, సంబంధిత శాఖల సెక్రటరీలు హాజరుకాకపోవడం తీవ్రమైన ఉల్లంఘనగా భావిస్తున్నారు. సంబంధిత శాఖ మంత్రి గొట్టిరవి కుమార్ కి కూడా ఈ పరిస్థితి ఏమాత్రం మింగుడు పడలేదు. ఇకపై వీళ్ల చర్య తీసుకోకతప్పదు అని ఆక్రోశం వెళ్లగక్కినట్టు తెలిసింది.
అధికారులు ఎందుకు ఖాతరు చేయడం లేదు?
ఇది కేవలం సమయపాలన సమస్య మాత్రమే కాదు, దీని వెనుక కొన్ని రాజకీయ, పరిపాలనా పరమైన కారణాలు ఉండవచ్చు. కొందరు సీనియర్ అధికారులు గత ప్రభుత్వాల పనితీరుకు అలవాటు పడి, ఇప్పుడు వచ్చిన మార్పులకు అనుగుణంగా మారలేకపోతున్నారు.
సీఎం స్థాయి నుంచి గట్టి హెచ్చరికలు ఉన్నా, మధ్యస్థాయిలో సమన్వయం చేసే విభాగాలు (Protocol/Liaison) విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది.
ఐఏఎస్-ఐపీఎస్ ల మనస్తత్వం ఎందుకు మారింది?
గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం, సీబీఐ విచారణలు వంటి వాటి వల్ల అధికారులు ఇప్పుడు చాలా 'సేఫ్' గా ఉండాలని చూస్తున్నారు. ఓవర్ యాక్టివ్గా ఉండటం కంటే, మినిమం పని చేసి వెళ్లిపోదాం అనే ఆలోచనలో కొందరు ఉన్నట్లు కనిపిస్తోంది.
అధికారులు కూడా రాజకీయ పార్టీల మధ్య నలిగిపోతున్నారు. ఒక ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారిని మరో ప్రభుత్వం రాగానే పక్కన పెట్టడం వంటి చర్యల వల్ల, అధికారుల్లో ప్రభుత్వం పట్ల ఉండాల్సిన నిబద్ధత తగ్గిపోయి ఉండవచ్చు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం 'వార్నింగ్' ఇస్తే సరిపోదు అని, "యాక్షన్" తీసుకుంటేనే ఐఏఎస్ వర్గాల్లో పాత క్రమశిక్షణ వస్తుందని సచివాలయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అజెండా ఐటమ్స్ ముగిసిన తర్వాత మంత్రులతో ఆయన చేసిన చర్చల్లో కూడా ఇదే అంశం ప్రధానంగా వచ్చినట్లు తెలుస్తోంది. అధికారుల ఈ ధీమాను తగ్గించాలంటే సీఎం తన పాత 'టాస్క్ మాస్టర్' అవతారాన్ని మళ్ళీ ప్రదర్శించాల్సిన అవసరం ఉందనేది వాస్తవం.
అధికారులు తమకు నచ్చిన చోట పోస్టింగ్లు సంపాదించుకున్నాక, రివ్యూ మీటింగ్ల పట్ల కొంత అలసత్వం ప్రదర్శించే అవకాశం ఉంది.
ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు అధికారులను పరుగులు పెట్టించడం తెలుసు. అయితే, ఇప్పుడు మారిన కాలానికి అనుగుణంగా అధికారులు తమ బాధ్యతలను విస్మరిస్తే అది ప్రభుత్వ ప్రతిష్ఠకే భంగం కలిగిస్తుంది. తాజా హెచ్చరికలతోనైనా ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో మళ్లీ ఆ పాత "క్రమశిక్షణ" వస్తుందో లేదో వేచి చూడాలి. అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం ద్వారా సీఎం ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపారు. "పనిలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదు." అని.. అయితే ఐఎఎస్ లు మాత్రం ఇది ఆయన నోటి నుంచి ఎప్పుడూ వస్తున్న మాటే కదా అనే దాకా వచ్చారని ఓ మాజీ ఐఎఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

