దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ (Compressed Natural Gas) ధరలు మరోసారి పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ధరలు పెరగడం వాహనదారులకు భారంగా మారింది.
తాజా పెంపుతో ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూ.80.09కు చేరింది. దేశంలోనే అతిపెద్ద సిటీ గ్యాస్ సంస్థ అయిన ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (Indraprastha Gas Limited) ఈ ధరల పెంపును ప్రకటించింది.
కిలోపై మరో రూపాయి పెంపు..
మే 17 ఉదయం 6 గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో కిలోకు రూ.1 చొప్పున పెంచుతున్నట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ పేర్కొంది. వారం రోజుల్లోనే రెండోసారి ధరను పెంచడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం కూడా కిలోకు రూ.2 పెంచారు. ఇప్పుడు మరో రూపాయి పెరగడంతో మొత్తంమీద కిలోపై రూ.3లు అదనంగా పెరిగింది.
ఎందుకు పెరిగాయి?
సహజ వాయువు కొనుగోలు ఖర్చులు పెరగడం, అమెరికన్ డాలర్ విలువ బలపడటం వల్ల సీఎన్జీ ధరలను పెంచాల్సి వచ్చిందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గ్యాస్ ఖర్చు పెరగడంతో, ఆ భారం కొంతవరకు వినియోగదారులపై పడుతోంది.
పైప్డ్ గ్యాస్ ధరల్లో మార్పు లేదు
ఇంటి వంట గ్యాస్గా ఉపయోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఉన్న ధరలే కొనసాగుతాయని సంస్థ స్పష్టం చేసింది. దీంతో గృహ వినియోగదారులకు తాత్కాలిక ఊరట లభించింది.
సీఎన్జీ వాహనాలకు ఆదానే..
ధరలు పెరిగినా కూడా, పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే సీఎన్జీ వాహనాల నిర్వహణ ఖర్చు తక్కువగానే ఉంటుందని సంస్థ పేర్కొంది.
ప్రస్తుత ధరల వద్ద కూడా సీఎన్జీ వాహనాలు ఉపయోగిస్తే 45 శాతం వరకు ఖర్చు ఆదా అవుతుందని ఇంద్రప్రస్థ గ్యాస్ వెల్లడించింది.

