ఆంధ్రప్రదేశ్లో భానుడు భగభగలాడుతున్నాడు. మే నెల ముగింపునకు వస్తున్న కొద్దీ ఎండల తీవ్రత ఊహించని స్థాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డులను తిరగరాస్తూ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే మొదలవుతున్న ఎండ తీవ్రత, మధ్యాహ్నానికి నరకాన్ని చూపిస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఏపీలో నెలకొన్న నిప్పుల కొలిమి లాంటి పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
చిట్యాలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత.. 48 డిగ్రీలు దాటిన పారాలురాష్ట్ర చరిత్రలోనే అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదవుతున్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై అధికార యంత్రాంగాన్ని సైతం షాక్కు గురిచేసింది. చిట్యాల మాత్రమే కాదు.. మిగిలిన జిల్లాల్లోనూ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, పశ్చిమగోదావరి జిల్లా తణుకులలో 48.1 డిగ్రీల భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం పరిధిలోని కూనవరంలో 47.3 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయి పల్లెలు, పట్టణాలను భగభగ మండిస్తున్నాయి.17 జిల్లాల్లో హాట్ వేవ్..174 మండలాల్లో సెగలుఉమ్మడి కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా రాష్ట్రంలోని మొత్తం 17 జిల్లాల వ్యాప్తంగా ఉన్న 174 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కును దాటేశాయి. పొడి వాతావరణం, దానికి తోడు తోడైన తీవ్రమైన వడగాల్పులు (Heat Waves) జనాన్ని ముంచెత్తుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో వీస్తున్న వేడి గాలుల కారణంగా రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. పశుపక్షాదులు సైతం తాగునీరు దొరకక, ఎండల తీవ్రత తట్టుకోలేక అల్లాడిపోతున్నాయి. అటు వ్యవసాయ కూలీలు, ఇటు నిర్మాణ రంగ కార్మికులు, బైక్ ప్రయాణికులు ఈ ఎండల దెబ్బకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.మరో మూడు రోజులు ఇదే నరకం..విపత్తుల సంస్థ హెచ్చరికరాష్ట్ర ప్రజలకు ఇప్పట్లో ఈ సూర్యప్రతాపం నుంచి ఉపశమనం లభించేలా లేదని వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో మరో మూడు రోజుల పాటు ఇలాంటి తీవ్రమైన పరిస్థితులే కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వడగాల్పుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు ఈ వాతావరణ మార్పుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.ఉదయం 11 నుండి 4 వరకు నో ఎగ్జిట్..ఇవీ జాగ్రత్తలుతీవ్రమైన ఎండల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది.అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని గట్టిగా హెచ్చరించింది.సూర్యరశ్మి నేరుగా తగలడం వల్ల వడదెబ్బ (Heat Stroke) తగిలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, ముఖానికి రుమాలు వంటివి ధరించాలని.. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు మంచినీరు, మజ్జిగ, కొబ్బరిబొండాలు, ఓఆర్ఎస్ (ORS) ద్రావణాలు ఎక్కువగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

