మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా ముసురుకున్నాయి. అమెరికా అగ్రరాజ్య అహంకారానికి, సైనిక బెదిరింపులకు తాము లొంగే ప్రసక్తి లేదని ఇరాన్ తేల్చిచెప్పింది.
శాంతి చర్చలకు దౌత్యపరమైన తలుపులు తెరిచే ఉంచినప్పటికీ.. బలవంతంగా తమను మోకాళ్లపై నిలబెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వాషింగ్టన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు, అమెరికా విధిస్తున్న ఆర్థిక, నౌకాదళ దిగ్బంధనానికి ప్రతిగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) పై ఇరాన్ పూర్తి పట్టు బిగించడంతో అంతర్జాతీయ సమాజం ఇంధన సంక్షోభం అంచున నిలబడింది."ఒత్తిళ్లకు లొంగడం కేవలం భ్రమ మాత్రమే" ఇరాన్ అమెరికా చేస్తున్న యుద్ధ హెచ్చరికలపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అత్యంత వ్యూహాత్మకంగా స్పందించారు. "మా వైపు నుండి దౌత్యపరమైన పరిష్కారానికి అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయి. కానీ, ఆంక్షలు, సైనిక బెదిరింపులతో ఒత్తిడి తెచ్చి ఇరాన్ను లొంగదీసుకోవాలనుకోవడం అమెరికాకు కేవలం భ్రమ మాత్రమే" అని ఆయన స్పష్టం చేశారు. హలో అమెరికా.. మీ బెదిరింపులకు మేము భయపడేది లేదు, మా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ఇరాన్ ఈ వ్యాఖ్యల ద్వారా పంపింది.

అయితే, అమెరికా రక్షణ యంత్రాంగం కూడా ఇరాన్పై అల్టిమేటం జారీ చేసింది. వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిలిటరీ- స్టీఫెన్ మిల్లర్ మాట్లాడుతూ.. అమెరికా నిబంధనలకు అంగీకరించకపోతే, ఆధునిక చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో ఇరాన్ సైనిక చర్యను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ సైతం తమ బలగాలు "లాక్డ్ అండ్ లోడెడ్" (దాడికి పూర్తి సిద్ధం) గా ఉన్నాయని ప్రకటించడంతో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి.
హర్ముజ్ జలసంధిపై PGSA పట్టు...
అమెరికా నౌకాదళ ఆంక్షలను తిప్పికొట్టేందుకు ఇరాన్ ఒక కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. హోర్ముజ్ జలసంధిని నియంత్రించేందుకు 'పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ (PGSA)' అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.
ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి అంతర్జాతీయ ఓడ ఇకపై PGSA నుండి ప్రత్యేక అనుమతులు (పర్మిట్లు) తీసుకోవాల్సిందేనని ఇరాన్ ప్రకటించింది. పర్మిట్ లేని ప్రయాణాలను అక్రమ రవాణాగా భావించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడిచమురు, సహజ వాయువులో ఐదింట ఒక వంతు (20%) ఈ సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ దీనిపై పట్టు సాధించడంతో ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ముడిచమురు ధరల సెగ..
యుద్ధ భయాలు, హర్ముజ్ జలసంధిలో సరఫరా నిలిచిపోతుందనే ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా దూసుకుపోయాయి.

బ్రెండ్ క్రూడ్ (Brent Crude Futures): 0.77 శాతం పెరిగి బ్యారెల్కు $105.83 కి చేరింది.
డబ్ల్యూటీఐ క్రూడ్ (WTI Futures): 0.99 శాతం పెరిగి బ్యారెల్కు $99.23 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఈ ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ఇప్పటికే పాకిస్తాన్ వంటి ఆసియా దేశాలపై పడటం ప్రారంభమైంది. అక్కడ ఇంధన ధరలు భారీగా పెరగడంతో సామాన్యులపై తీవ్ర భారం పడుతోంది.
ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ వంటి దేశాలలో ఇంధన ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలపై తీవ్రమైన భారం పడుతోంది. చమురు ధరలు ఇలాగే పెరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి, తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
G7 సదస్సు వైపు ప్రపంచ దేశాల చూపు...
ఒకవైపు ఇరాన్-అమెరికా సవాల్ ప్రతిసవాళ్లు విసురుకుంటుంటే, మరోవైపు గాజా, లెబనాన్లలో ఇజ్రాయెల్ దాడులతో మధ్యప్రాచ్యం రక్తాసిక్తమవుతోంది. అక్టోబర్ 2023 నుండి గాజాపై జరుగుతున్న దాడులలో ఇప్పటివరకు 72,773 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లో తాజాగా జరిగిన దాడుల్లో మరో 20 మంది మరణించారు. ఇక్కడ కుదిరిన 'కాల్పుల విరమణ' కేవలం కాగితాలకే పరిమితమైంది.
మరో ఆసక్తికర పరిణామంలో.. ఇజ్రాయెల్ మానవ హక్కుల ఉల్లంఘనలపై గళమెత్తిన ఐరాస ప్రతినిధి ఫ్రాన్సెస్కా అల్బనీస్పై విధించిన ఆంక్షలను అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ఇటు రష్యా కూడా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
వచ్చే నెలలో ఫ్రాన్స్లో జరగబోయే G7 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరవుతున్నారు. అక్కడ ఇరాన్ సంక్షోభంపై చర్చలు సఫలమై, దౌత్యపరమైన పరిష్కారం లభిస్తే చమురు ధరలు వేగంగా తగ్గుతాయి. ఒకవేళ ఇరుదేశాలు సైనిక చర్యలకే మొగ్గు చూపితే మాత్రం ప్రపంచం మరింత తీవ్రమైన ఆర్థిక, ఇంధన అంధకారంలో మునిగిపోక తప్పదు.

