పశ్చిమాసియాలో పెరుగుతోన్న ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం, యుద్ధాల ప్రభావంపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
నెదర్లాండ్స్లో భారతీయ ప్రవాసులనుద్దేశించి ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచం ఇంకా కోలుకోకముందే యుద్ధాలు, ఇంధన సమస్యలు పెరిగాయని తెలిపారు.
"ప్రపంచం విపత్తుల దశలో ఉంది"
"మొదట కరోనా వచ్చింది.. తర్వాత యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఇంధన సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. పరిస్థితులు త్వరగా మారకపోతే గత కొన్ని దశాబ్దాలుగా సాధించిన అభివృద్ధి దెబ్బతింటుంది" అని మోదీ అన్నారు. ఈ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మళ్లీ పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
స్వావలంబన అవసరమన్న ప్రధాని..
ప్రస్తుత పరిస్థితులు ప్రతి దేశానికి స్వావలంబన ఎంత ముఖ్యమో గుర్తు చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంధన భద్రత, సరఫరా వ్యవస్థలు, ఆర్థిక స్థిరత్వం వంటి రంగాల్లో దేశాలు బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ కూడా అదే దిశగా ముందుకు వెళ్తోందని చెప్పారు.
ఇంధన పొదుపుపై మోదీ పిలుపు..
ఇటీవల దేశ ప్రజలకు మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు సూచనలను మరోసారి గుర్తు చేశారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, సాధ్యమైన చోట ఇంటి నుంచే పని చేయాలని సూచించారు. ప్రజా రవాణా ఎక్కువగా ఉపయోగించాలని, కార్పూలింగ్ చేయాలని, ఇంధనాన్ని ఆదా చేయడం కూడా దేశభక్తి చర్యేనని ఆయన పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం..
ఇంధన సంక్షోభం నేపథ్యంలోనే ఇటీవల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 చొప్పున పెరిగాయి. నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటి పెద్ద పెంపుగా భావిస్తున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద సమస్యలు తలెత్తడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగినట్లు సమాచారం.
భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యం..
నెదర్లాండ్స్తో భారత్ బలమైన సంబంధాలు కొనసాగిస్తోందని మోదీ తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచ సంక్షోభాలను తట్టుకునేలా బలమైన సరఫరా వ్యవస్థలను కలిసి నిర్మిస్తామని చెప్పారు.
ప్రవాస భారతీయులకు పిలుపు..
"వికసిత్ భారత్ 2047" లక్ష్య సాధనలో ప్రవాస భారతీయులు కూడా భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

