Dailyhunt
తిరుప్పరన్‌కుండ్రంలో బీజేపీ ఎందుకు పోటీచేయడం లేదు..

తిరుప్పరన్‌కుండ్రంలో బీజేపీ ఎందుకు పోటీచేయడం లేదు..

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (The National Democratic Alliance) కూటమిలో బీజేపీకి 27 సీట్లు దక్కాయి. అయితే కీలక నియోజకవర్గం తిరుప్పరన్‌కుండ్రంలో మాత్రం పోటీ చేయకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఈ పరిణామం కాషాయ పార్టీ వాస్తవ స్థితిని బయటపెడుతుందని రాజకీయ విమర్శకుడు ఎ. ముత్తుకృష్ణన్ అంటున్నారు. క్షేత్రస్థాయిలో డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్యనే ప్రధాన పోరు ఉంటుందని, బీజేపీ తనంతట తానుగా ప్రభావం చూపే స్థాయికి ఇంకా చేరుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

తిరుప్పరన్‌కుండ్రం విషయంలో..

''గత ఏడాది నుంచి అక్కడ మతపర అంశాలను ప్రస్తావిస్తూ, ఆ ప్రాంతాన్ని "దక్షిణ అయోధ్య"గా ప్రచారం చేయడానికి బీజేపీ ప్రయత్నించింది. ప్రధాని మోదీ పర్యటనతో రాజకీయంగా వేడి పెంచాలని భావించింది. అయితే స్థానికులు ఆ ప్రయత్నాలకు ఆశించిన స్థాయిలో స్పందించలేదు.' అని పేర్కొన్నారు.

తిరుప్పరన్‌కుండ్రం ఆర్థిక వ్యవస్థ యాత్రికులు, పండుగలు, వివాహాలపై ఆధారపడి ఉంటుంది. శాంతి, సామరస్యమే అక్కడి ప్రజలకు ముఖ్యమైంది. మత ఘర్షణలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ప్రజలు భావిస్తారు. దీంతో బీజేపీ మతపర అంశాలు అక్కడ విఫలమయ్యాయి. స్థానికంగా ప్రజలు వాటిని అంగీకరించలేదు. దీంతో ఆ పార్టీ అక్కడ బలంగా నిలబడలేకపోయింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి AIADMK అభ్యర్థి పోటీ చేస్తున్నారు.

ఇది కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదు. మతపర, విభజనాత్మక రాజకీయాలకు రాష్ట్రంలో పెద్దగా ఆదరణ లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. తంజావూరులో జరిగిన మైఖేల్‌పట్టి ఘటనను ఉదాహరణగా చూపుతూ, ఇలాంటి అంశాలను రాజకీయంగా ఉపయోగించుకోవాలన్న ప్రయత్నాలు ఫలించలేదని చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే బీజేపీ ప్రభావం ఇంకా పరిమితంగానే ఉందని, పెద్ద ప్రాంతీయ పార్టీలైన ఏఐఏడీఎంకే ఆధారంగానే ఆ పార్టీ ముందుకు సాగాల్సి వస్తోందని ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh