పేద విద్యార్థులు, రోగులకు అందిస్తున్న సేవలు విస్తరించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. టీటీడీ విద్య సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఆధునిక విద్య బోధనకు చరిత్రలోనే మొదటిసారి భారీగా నిధులు కేటాయించారు.
టీటీడీలో పని చేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ శ్రీవారి దర్శనం, లడ్డూ కార్డు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పాలక మండలి చైర్మన్ బీఆర్. నాయుడు మీడియాకు చెప్పారు. తిరుమలలో బుధవారం నిర్వహించిన టీటీడీ పాలక మండలిలో తీర్మానించిన అంశాలను ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులతో కలిసి ఆ వివరాలను చైర్మన్ బీఆర్. నాయుడు మీడియాకు వివరించారు. "టీటీడీ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ లో భాగంగా ఇప్పుడిస్తున్న రూ. మూడు లక్షలకు అదనంగా మరో రూ. రెండు లక్షలు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని నిర్ణయించాం. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు అలిపిరిలోని శ్రీవినాయకస్వామి ఆలయ సమీపంలో రూ.4.25 కోట్లతో బస్సుల తనిఖీకి శాశ్వత షెల్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వివరించారు.

పాలక మండలిలో చేసిన తీర్మానాలు ఇవీ..
1. తిరుమల ఆళ్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుంచి బాట గంగమ్మ సర్కిల్ వరకు ఉన్న సర్వదర్శనం క్యూలైన్లలో రూ.4.55 కోట్లతో అదనపు మరుగుదొడ్లు నిర్మించేందుకు ఆమోదం. 2. తిరుమలలోని రోడ్లు, సర్కిళ్లకు కమిటీ సూచించిన ఆధ్యాత్మిక, పురాణ ప్రాశస్థ్యం కలిగిన పేర్లను పెట్టేందుకు ఆమోదం.3. టిటిడి బోర్డు విద్యా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు టీటీడీ విద్యా సంస్థలలో అత్యాధునిక మౌళిక వసతుల ఏర్పాటుకు అదనంగా రూ.43.40 కోట్లు మంజూరుకు ఆమోదం. ఇప్పటికే గత బోర్డు సమావేశంలో రూ.118 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మొత్తం కలిపి రూ.161.40 కోట్లు కేటాయించాం. 4. తిరుమలలో నీటి వృధాను అరికట్టేందుకు, రోజు రోజుకు పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా గోగర్భం డ్యాం నుంచి ఫిల్టర్ ప్లాంట్ వరకు రూ.6 కోట్లతో దాదాపు 2 కిలో మీటర్ల మేర అదనపు పైపులైన్ ఏర్పాటుకు ఆమోదం.5. టీటీడీ అవసరాల నిమిత్తం రూ. 44.20 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో-ఆప్టెక్స్ సంస్థల నుండి పట్టు వస్త్రాలు, దుప్పటాలు తదితరాలు కొనుగోలు చేసేందుకు ఆమోదం.6. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వర్ధనపల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి రూ.55 లక్షలు ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం.7. సనాతన ధర్మాన్ని మరింత వ్యాప్తి చేసేందుకు తలపెట్టిన "అక్షర గోవిందం" కార్యక్రమంలో పాల్గొనే చిన్న పిల్లలకు పంపిణీ చేసే కిట్ను ఉచితంగా అందించేందుకు నిర్ణయం.

