Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉత్తరప్రదేశ్‌ అతలాకుతలం..

ఉత్తరప్రదేశ్‌ అతలాకుతలం..

త్తరప్రదేశ్‌లో భారీ తుఫాను, వర్షాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి.

చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పాటు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనల్లో కనీసం 111 మంది ప్రాణాలు కోల్పోగా, 72 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఈ ప్రకృతి విపత్తు తీవ్ర ప్రభావం చూపింది. సహాయ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. తుఫాను, వడగళ్ల వాన, మెరుపుల కారణంగా భారీ ప్రాణనష్టం జరిగింది. 170 పశువులు కూడా మృతి చెందగా, 227 ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాలుల ధాటికి భారీ చెట్లు నేలకొరిగాయి. అనేక విద్యుత్ స్తంభాలు పక్కకు వాలాయి. కొన్ని ప్రాంతాల్లో రేకుల షెడ్లు, హోర్డింగ్‌లు గాలికి ఎగిరిపోయాయి. పలుచోట్ల చెట్లు రోడ్లపై పడటంతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించింది. కొన్ని వాహనాలు చెట్ల కింద నలిగిపోయాయి.

తుఫాను తర్వాత వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని స్థానికులు, అధికారులు కలిసి బయటకు తీశారు. చాలా మంది చేతులతోనే మట్టి తొలగిస్తూ రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

50 అడుగుల పొలంలో పడి గాయాలు..

బరేలీ జిల్లాలో ఒక వ్యక్తి రేకుల కప్పుతో కలిసి గాలికి ఎగిరిపడిన ఘటన కలకలం రేపింది. బామియాన్ గ్రామంలో తుఫాను సమయంలో ఆ వ్యక్తి సుమారు 50 అడుగుల ఎత్తులో పొలంలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు.

భదోహి జిల్లాలో కూడా పరిస్థితి దారుణంగా మారింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. మొబైల్ నెట్‌వర్క్ సేవలు కూడా దెబ్బతినడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది.

బుడౌన్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బిసోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధ్‌పూర్ కైథోలి గ్రామంలో గుడిసె మట్టి గోడ కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మౌసమి (10), రజని (9) అనే బాలికలు తుఫాను నుంచి రక్షణ కోసం గుడిసెలోకి వెళ్లగా, గోడ కూలిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

అదే జిల్లాలో మరో ఘటనలో యూకలిప్టస్ చెట్టు లారీపై కూలిపోవడంతో డ్రైవర్ యోగేష్ (32) మరణించాడు. మరో యువకుడు అన్షుల్ శర్మ (22) కూడా చెట్టు కూలిపడి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనలపై స్పందించిన యోగి ఆదిత్యనాథ్ బాధితులకు వెంటనే సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. 24 గంటల్లోపు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాధిత కుటుంబాలతో నేరుగా మాట్లాడి వారికి అవసరమైన సహాయం అందించాలని సూచించారు.

ప్రధాని మోదీ కూడా ఈ ప్రకృతి విపత్తుపై స్పందించారు. ఉత్తరప్రదేశ్‌కు కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) కూడా ఈ ఘటనపై సంతాపం తెలిపారు. భారీ ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేస్తూ భారత ప్రజలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh