పశ్చిమ బెంగాల్లో 293 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. గెలుపొందిన అభ్యర్థులు ఎలాంటి ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ అగర్వాల్ తెలిపారు.
ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోందని, రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
"ఈరోజు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వవద్దని మేం డీఎంలందరికీ ఆదేశాలు జారీ చేశాం. వాటికి రేపటి నుంచి అనుమతి ఉంటుంది. ఎన్నికల అనంతర హింసను మేం కోరుకోవడం లేదు, కాబట్టి ప్రతిఒక్కరూ ప్రశాంతంగా ఉండి శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం," అని సీఈఓ పేర్కొన్నారు.
విజయోత్సవ ర్యాలీల నిర్వహణకు రాజకీయ పార్టీలు స్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి అనుమతి తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.
"ఎలాంటి హింసాత్మక ఘటన జరగలేదు. బెంగాల్లో ఎక్కడా కూడా ఎన్నికల సంబంధిత మరణాలు నమోదవ్వలేదు," అని అగర్వాల్ అన్నారు.
వివిధ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోలేకపోతున్నారన్న ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ జరుపుతోందని ప్రత్యేక పరిశీలకుడు సుబ్రతా గుప్తా ఈ రోజు ఉదయం విలేకరులతో అన్నారు.

