విశాఖపట్టణం సుందర నగరం. ఇక్కడి విమానాశ్రయం ఈ ప్రాంత ప్రజలకు ఆత్మ లాంటిదే. 65 ఏళ్ల సుదీర్ఘ సేవలకు పౌర సేవలకు వీడ్కోలు పలికారు. 65 ఏళ్ల సుదీర్ఘ సేవలకు పౌర సేవలకు వీడ్కోలు పలికారు.
దేశ భద్రత కోసం రక్షణ శాఖ పరిధిలోకి వెళ్లడం వల్ల, ఇక్కడ మెయింటెనెన్స్ సేవలతో ఉపాధి పొందిన కార్మికులు వేదనకు గురయ్యారు. ఆత్మీయత నుంచి తమను దూరం చేశారనే మాటల కన్నీళ్లు కార్చాయి.
విశాఖకు సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పౌర విమాన సర్వీసులు సంబరంగా, సగర్వంగా ప్రారంభమయ్యాయి. అయితే, కోట్లాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన విశాఖ పాత విమానాశ్రయం మూతపడటం స్థానికులను, సిబ్బందిని తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది."
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నేవీకి అప్పగించడం వల్ల 2023 నుంచే టెన్షన్ మొదలైంది. 2025 చివరి నుంచి 2026 లో కార్గో, కొన్ని ఫ్లైట్లు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి షిఫ్ట్ అవడంతో "పాత విశాఖ ఎయిర్పోర్ట్" నుంచి పౌర విమానసేవలు ముగిశాయి. ఇది ఈ ప్రాంత ప్రజలకు కేవలం ఒక నిర్మాణం కాదు, ఒక భావోద్వేగం, ఒక ఆత్మ వంటిది!
1940లో ద్వితీయ ప్రపంచ యుద్ధ సమయంలో ఒక చిన్న ఎయిర్స్ట్రిప్గా దీని ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత రక్షణ శాఖ, భారత నౌకాదళం అధీనంలోకి వెళ్లాక, 1991లో 'INS డేగా'గా అవతరించింది.
బడుగు జీవుల ఉపాధికి దెబ్బ
ఒకప్పుడు లక్షల మంది రాకపోకలు సాగిన విశాఖ విమానాశ్రయం నిర్మానుష్యంగా మారింది. భోగాపురం వచ్చిందని సంబరపడ్డాం. కానీ ఇక్కడ 1200 కుటుంబాల కడుపు కొట్టిందని కలత చెందుతున్నారు. వారిలో గ్రౌండ్ హ్యాండ్లింగ్, క్యాటరింగ్, సెక్యూరిటీ, క్లీనింగ్ స్టాఫ్ వారందరి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలలుగా జీతాలు లేట్. "భోగాపురం లో మళ్లీ జాబ్ దొరుకుతుందా?" అనే భయం వారిని వెంటాడుతోంది.
ఈ విమానాశ్రయంపై పరోక్షంగా పది వేల మందికి పైగానే ఆధారపడ్డారు. వారిలో ఆటో డ్రయివర్లు, టాక్సీ డ్రైవర్లు, హోటల్స్, లాడ్జీలు కాకుండా, పార్శిల్ సర్వీసులతో పాటు దుకాణదారులు కూడా ఉన్నారు.
"విశాఖ ఎయిర్పోర్ట్ ఉండగా రోజుకు 50 రైడ్స్ ఉండేవి. ఇప్పుడు అందులో పది కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది" అని ఆటో డ్రైవర్లు, టాక్సీల డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.
కార్మికులు కోరుతున్నది మూడే అంశాలు..
1. భోగాపురం లో ప్రాధాన్యత: పాత కార్మికులకు ముందుగా ఉద్యోగం
2. పరిహారం: ఉద్యోగం వదులుకునే వాళ్లకు మంచి ప్యాకేజీ
3. విశాఖ ఎయిర్పోర్ట్ ను కార్గో హబ్ గా: పూర్తిగా మూయొద్దు, వేరే వాడకానికి ఇవ్వాలి
"కార్మికులు చెబుతున్నది ఒక్కటే. అభివృద్ధి కావాలి కానీ... అభివృద్ధిలో మనిషి ఉండాలి.భోగాపురం 60km దూరం. ప్రభుత్వం ట్రాన్స్ఫర్ ఇచ్చింది. కానీ విశాఖలో ఇల్లు, స్కూల్, ఆసుపత్రి వదిలి ఎవరు వెళ్తారు?
కార్మిక సంఘాల డిమాండ్
1. పాత వారికి భోగాపురంలో ప్రాధాన్యత 2. VRS తీసుకునే వారికి మంచి ప్యాకేజీ 3. పాత ఎయిర్పోర్ట్ ను MRO గా మార్చాలి" అనేది వారి మనసులో మాట.
"ఎయిర్పోర్ట్ మూతపడింది. కానీ ఈ కుటుంబాల గుండెలు మూతపడకుండా ప్రభుత్వం చూడాలి" అని అభ్యర్థిస్తున్నారు. ఎందుకంటే..
1. ఉద్యోగం పోతుందేమో అనే భయం
2. 20 ఏళ్ల సర్వీస్ కు విలువ లేదనే ఆత్మగౌరవ దెబ్బ
3. కుటుంబాన్ని ఎలా పోషించాలనే ఆర్థిక ఆందోళన"
రెండో ప్రపంచ యుద్ధం నుంచి..
విశాఖపట్టణంలో 1981లో ఇండియన్ ఎయిర్లైన్స్ ద్వారా రోజుకు కేవలం ఒక్క సర్వీస్తో మొదలైన పౌర విమాన ప్రయాణం... రోజుకు 70కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకల స్థాయికి ఎదిగింది. 2005 భారీ వర్షాలు, 2014లో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో తాకిన హుద్హుద్ తుఫాన్ బీభత్సానికి టెర్మినల్ కప్పు ఎగిరిపోయినా... గాయపడిన పక్షిలా మళ్లీ నిలబడింది ఈ విమానాశ్రయం. నైట్ ల్యాండింగ్ ఆంక్షలు, నేవీ శిక్షణా సమయాల్లో నిరీక్షణలు ఉన్నప్పటికీ ప్రజలకు నిరంతరం సేవలందించింది."
కార్మికుల కన్నీటి వేదన
విశాఖ ఇది కేవలం ఒక విమానాశ్రయం మార్పు మాత్రమే కాదు... దీంతో ముడిపడి ఉన్న వేలాది కుటుంబాల జీవనాధారానికి సంబంధించిన కన్నీనీటి గాథ. దశాబ్దాల కాలంలో కేవలం పౌర సేవలు అందించడమే కాదు... రాత్రింబవళ్లు శ్రమిస్తూ పారిశుద్ధ్యాన్ని కాపాడుతూ, ప్రయాణికులకు నిరంతర సేవలు అందించడంలో కార్మికులు తమ ప్రాణాలను, జీవితాలను మమేకం చేశారు. చివరి రోజు ఆదివారం ఇక్కడ మహిళా శ్రామికులు కన్నీటి పర్యంతం కావడం అందరినీ కలిచి వేసింది. తమ ఆత్మగా భావించిన విమానాశ్రయం దరిదాపుల్లోకి రాలేమనే వేదన వారి కన్నీటి వెనుక కనిపించింది. ఉపాధికి కూడా దూరమైన కార్మికుల వేదన సిబ్బంది, అధికారులకు కూడా నోట మాట రాలేదు.
విశాఖ విమానాశ్రయం ఇప్పుడు పూర్తిగా దేశ భద్రత కోసం రక్షణ శాఖ పరిధిలోకి వెళ్లింది. ఇక్కడ పౌర సేవలు ముగిసి ఇక్కడ పనిచేసే అనేకమంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పారిశుద్ధ్య సిబ్బంది, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ట్రాలీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు తమ ఐడీ కార్డులు తీసివేస్తూ విలపించిన దృశ్యాలు గుండెలను పిండేశాయి. దశాబ్దాలుగా పేనవేసుకున్న ఆత్మీయత నుంచి తమను బలవంతంగా దూరం చేశారనే వేదనతో వారు కార్చిన కన్నీళ్లు అందరినీ కలచివేశాయి. భోగాపురంలో కొందరికి పునరావాస హామీలు ఉన్నప్పటికీ, దూరభారం కారణంగా వందలాది కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొంది.
ఇక సెలవు..
"విశాఖ పాత ఎయిర్పోర్ట్లో పౌర విమానాల చప్పుడు ఇక వినిపించకపోవచ్చు. అక్కడ కేవలం యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల శబ్దాలే మిగలవచ్చు. కానీ 65 ఏళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో కోట్లాది మందికి అందించిన జ్ఞాపకాలు, అక్కడి కార్మికులు చిందించిన చెమట బొట్లు మాత్రం ఎప్పటికీ శాశ్వతం! 'ఇక సెలవు' అంటూ గుండె భారంతో వీడ్కోలు పలికారు. కొత్త ఆశలతో భోగాపురం నయా శకానికి నాంది పలికిన ప్రదేశంలో పాత సిబ్బంది కళ్లలో మళ్ళీ ఆనందం నింపుతారా? వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపడం అనేది ఇక్కడి విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు నిర్వహించే జీఎంఆర్ సంస్థ ఏమి చేయబోతోందనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

